Begin typing your search above and press return to search.

ఇలా విమ‌ర్శ‌లు చేస్తే పార్టీలో జోష్ ఎలా వ‌స్తుంది?

By:  Tupaki Desk   |   4 March 2019 6:08 AM GMT
ఇలా విమ‌ర్శ‌లు చేస్తే పార్టీలో జోష్ ఎలా వ‌స్తుంది?
X
మ‌నిషి అన్న త‌ర్వాత అసంతృప్తి ఉండాల్సిందే. మోతాదుకు మించ‌ని అసంతృప్తితో ఎలాంటి ఇబ్బంది లేదు. వాస్త‌వానికి అసంతృప్తి ఒక లెక్క ప్ర‌కారం ఉంటే.. ఉన్న‌తికి కార‌ణంగా మారుతుంది. అదే స‌మ‌యంలో మోతాదుకు మించేలా ఉంటే లేనిపోని త‌ల‌నొప్పుల‌కు కార‌ణ‌మ‌వుతుంటుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. అసంతృప్తి అన్న రెండు మాట‌లు విన్నంత‌నే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పేర్లు చ‌టుక్కున మ‌న‌సులో మెదులుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా చెప్పుకుంటూ ఉండే వీరిద్ద‌రు పార్టీని.. పార్టీలో ప‌రిస్థితుల‌పై ఏదో వంక‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూనే ఉంటారు. అదే స‌మ‌యంలో న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాల్ని వ‌దిలి బ‌య‌ట‌కు రాని వీరి వ్య‌వ‌హారం త‌ర‌చూ ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. పార్టీకి ఇబ్బంది పెట్టేలా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

చెప్పులో రాయి..కంట్లో న‌ల‌క‌.. ప‌ళ్ల కింద ప‌లుకు అన్ని చికాకు పెట్టేవే. అదే రీతిలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ చేసే విమ‌ర్శ‌లు పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉండ‌ట‌మే కాదు.. పార్టీ లోని లోపాల్ని త‌ర‌చూ బ‌య‌ట‌పెట్టేస్తుంటాయి. క‌ష్టం వ‌చ్చిన వేళ‌.. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ఉండి.. బ‌ల‌హాన‌త‌ల్ని ఐక‌మ‌త్య‌మ‌నే బ‌లంతో క‌వ‌ర్ చేసుకోవాల్సింది పోయి.. త‌మ‌కు మించిన ప్ర‌జాస్వామ్య‌వాది లేడ‌న్న‌ట్లుగా అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌టం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కే చెల్లుతుంది.

తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు సంఖ్యా బ‌లం లేన‌ప్ప‌టికీ బ‌రిలోకి దిగిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హంతో నిర‌స‌న వ్య‌క్తం చేస్తుంటే..దాని మీద దృష్టి పెట్ట‌టం పోయి.. అసెంబ్లీలో ఓడిన నాయ‌క‌త్వంలోనే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు త‌యార‌వుతుంటే పార్టీలో జోష్ ఎలా వ‌స్తుందంటూ ప్ర‌శ్నిస్తున్న వైనం కాంగ్రెస్ కు న‌ష్ట‌మే త‌ప్పించి లాభం ఉండ‌ద‌ని చెప్పాలి. త‌మ‌కు పార్టీ ప‌గ్గాలు ఇస్తే కానీ తెలంగాణ‌లో కాంగ్రెస్ బాగుప‌డ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తాజాగా త‌మ మ‌న‌సులోని మాట‌ను ఓపెన్ గా చెప్పేశారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన నాయ‌కత్వం నేతృత్వంలోనే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టంతో పార్టీకి జోష్ రావ‌టం లేద‌ని.. ఎన్నిక‌ల ముందు అదే చెప్పామ‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత అదే చెబుతున్న‌ట్లుగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చెబుతున్నారు. త‌మ‌కు రాజీవ్ గాంధీని ప్ర‌ధానిని చేయ‌ట‌మే లక్ష్యంగా చెబుతున్న వారు..వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎనిమిది ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించ‌ట‌మే ల‌క్ష్య‌మంటున్నారు. మ‌రీ విధంగా విమ‌ర్శ‌లు చేస్తే.. పార్టీలో జోష్ రాక‌పోగా.. రాహుల్ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం మీదా దెబ్బ ప‌డుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. ఈ మాట‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు వినిపించే అవ‌కాశం ఉందంటారా?