Begin typing your search above and press return to search.

లీగల్ నోటీస్ బండి సంజయ్ కి ఇవ్వాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

By:  Tupaki Desk   |   5 Aug 2022 5:26 AM GMT
లీగల్ నోటీస్ బండి సంజయ్ కి ఇవ్వాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
X
'కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్లుగా కొనసాగుతున్న తాను పార్టీ మారుతున్నానని.. కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు..అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతా..' అని భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అయితే కోమటిరెడ్డి పార్టీ మారుతారని ముందుగా చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. యాదాద్రిలో పాదయాత్ర చేస్తున్న ఆయన రాజగోపాల్ రెడ్డి లాగే వెంటరెడ్డి కూడా బీజేపీలో చేరుతానన్నారు. అందువల్ల ముందు బండి సంజయ్ కి నోటీసులు ఇవ్వండి.. అప్పుడు మీరు పార్టీ మారరని అందరికీ అర్థమవుతుంది.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు కాంగ్రెస్ ను వీడొద్దని అనుకుంటే రాజకీయ విశ్లేషకులపై కాకుండా ఆ వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరుతారని అంటున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో 'ప్రజా ప్రస్థానం' పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు బీజేపీలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోదీకి, బీజేపీకి అనుకూలంగా మాట్లాడారని అన్నారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలో తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారని, దీంతో తెలంగాణలో పలుచోట్ల ఉప ఎన్నికలు రానున్నాయని అన్నారు.

అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు రాజకీయ విశ్లేషకులు చర్చలు జరిపారు. రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకటరెడ్డి వెళ్తారా..? అని డిబేట్లు నిర్వహించారు. వీటిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు. 'నేను పార్టీ మారుతానని చాలామంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికి లీగల్ నోటీసులు పంపిస్తా.. కోమటిరెడ్డి బ్రాండ్ లేదనడం కరెక్ట్ కాదు. నేను నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్లోకి రాలేదు. 35 ఏళ్లుగా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా.. అందుకు తనకు ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు' అని అన్నారు. అయితే తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై వెంకటరెడ్డి స్పందించలేదు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఆసక్తికర చర్చను లేపాయి. నిప్పు లేనిదే పొగరాదు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ మారే విషయంలో రాజగోపాల్ రెడ్డి ముందే లీక్స్ ఇచ్చారు. ఆ లీక్స్ తోనే కొందరు కోమటరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మార్పు గురించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా చేయలేదని, ఆయన రాజీనామా ఆమోదం తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. దీంతో పార్టీ మారే ఆలోచన వెంకటరెడ్డిలో ఉన్నట్లేగా..? అని అంటున్నారు.

ఇక మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెంకటరెడ్డి అంటున్నారు. కానీ గతంలో పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఒక దశలో ఢిల్లీకి వెళ్లి మరీ చక్రం తిప్పారు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే ఇదంతా తెరపై జరిగింది. కానీ తెరవెనుక వేరే తతంగం నడిచిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం తెరపైకి రాగానే అన్న వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ కాకుండా రాజగోపాల్ రెడ్డి అడ్డుకున్నారని అన్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలున్నట్లు తేలింది.

ఈ విభేదాలతోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని మరో ప్రచారం సాగుతోంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్ హవా తగ్గలేదన్నారు. ఎన్నికలేవైనా తామిద్దరం గెలుస్తామని గతంలో పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు తమ్మడు బీజేపీలోకి మారుతున్న సమయంలో ఆ వ్యాఖ్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. పైపెచ్చు తన గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు ఇస్తానని అంటున్నారు. అయితే కోమటిరెడ్డి నిజంగా లీగల్ నోటీసులు ఇవ్వదలుచుకుంటే ముందు బండి సంజయ్ కి ఇవ్వండి.. అప్పుడు మీరు పార్టీ మారడం లేదని ప్రజలందరూ అనుకుంటారు.. అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.