Begin typing your search above and press return to search.

అన్నదమ్ములిద్దరూ అలా పారిపోయారేంటి?

By:  Tupaki Desk   |   5 April 2018 4:30 AM GMT
అన్నదమ్ములిద్దరూ అలా పారిపోయారేంటి?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ మీద చెలరేగడంలో అందరూ ఫైర్ బ్రాండ్ నాయకులే. కానీ.. పార్టీ అంతర్గత రాజకీయాల్లో నిత్యం ఫైర్ బ్రాండ్ లుగా, నిత్య అసంతృప్తివాదులుగా ఉండే నాయకులు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు. పీసీసీ అధ్యక్ష స్థానంలో ఎవ్వరున్నా సరే.. వారికి పొసగదు. ఎందుకంటే.. ఆ స్థానానికి తాము మాత్రమే కరెక్టు వ్యక్తులు అని వారికి ఒక నమ్మకం. అందుకే నిత్య అసంతృప్తితోనే వారు వేగిపోతుంటారు. కాంగ్రెస్ పార్టీని వీడేవారు కాదు గానీ.. కాంగ్రెస్ లో ఒకింత అసహనంతోనే- తమ సొంత ఎజెండాతో పనిచేసుకుంటూ ఉంటారు. అలాంటి కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ ఇద్దరూ కూడా ఎంపీలుగానే పోటీచేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వెంకటరెడ్డి పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడి ఉంది. దానిపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్సీగా ఉన్నారు. తమ మీద అనర్హత వేటు వేసిన ఈ దుష్ట అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టకూడదనే పంతానికి పోయారో... లేదా, ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు గానీ.. ఈ ఇద్దరూ కూడా ఎంపీ ఎన్నికల్లో దిగుతారట.

మరో కోణంలోంచి చూసినప్పుడు వెంకటరెడ్డి తాను నల్గొండ ఎంపీగా బరిలో ఉంటానని.. అనర్హత వేటుకు చాలా కాలం ముందునుంచే చెబుతూ వస్తున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి కూడా భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీచేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ కీలక భూమిక ఉన్న ఈ సోదరులిద్దరూ.. హఠాత్తుగా ఇలా పలాయనవాద నిర్ణయం తీసుకున్నారేమిటా? అనే చర్చ పలువురిలో నడుస్తోంది.

రాష్ట్ర రాజకీయాలనుంచి ఈ సోదరులిద్దరూ పారిపోవడానికి చిహ్నమే ఈ నిర్ణయం అని తెరాస వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ కు టీపీసీసీలో నాయకత్వంతో విభేదాలు ఉన్నాయని.. ఇక్కడ తమ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి అంతగా లేకపోవడంతో.. తామే పక్కకు తప్పుకుని కేంద్ర రాజకీయాల మీద మాత్రం దృష్టిపెడితే పోతుందని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటానని చెప్పినా... పీసీసీ సారథ్యం కూడా ఇవ్వని అధిష్టానం.. వారి తాజా ఆలోచనల్ని ఎలా పరిగణిస్తుందో వేచిచూడాలి.