Begin typing your search above and press return to search.

అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్ భేటీ.. టీ కాంగ్రెస్ లో కాక షురూ

By:  Tupaki Desk   |   23 July 2022 4:11 AM GMT
అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్ భేటీ.. టీ కాంగ్రెస్ లో కాక షురూ
X
కొంతకాలం క్రితం పార్టీని వదిలి.. బీజేపీలో చేరతానంటూ ఓపెన్ గా చెప్పేసిన సీనియర్ కాంగ్రెస్ నేత.. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. బీజేపీలోకి వెళతానని చెప్పినప్పటికీ.. వెళ్లాలా? వద్దా? అన్న సంశమయంలో ఉన్న అతను.. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి కమ్ బీజేపీలో కీలక నేత అయిన అమిత్ షాతో భేటీ కావటం ఆసక్తికరంగా మారటమే కాదు.. టీ కాంగ్రెస్ లో కాక పుట్టేలా చేసింది.
దాదాపు ఏడాదిన్నర క్రితం తాను కాంగ్రెస్ ను వదిలి బీజేపీలోకి వెళతానని చెప్పటం తెలిసిందే.

అప్పట్లో తాను బీజేపీకి వెళితే.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినన్న ఆడియో సంచలనంగా మారింది. తానున్న కాంగ్రెస్ పార్టీలో అంత యాక్టివ్ గా లేని అతను బీజేపీకి లోకి వెళ్లటం ఖాయమని భావించినా.. అదెప్పుడు అన్న విషయంపై మాత్రం చాలానే డౌట్లు ఉన్నాయి.

అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ కంటే బీజేపీనే బెటర్ అని భావిస్తున్న ఆయన.. సమయం చూసుకొని కమలం పార్టీలో చేరతారని భావించారు అయితే.. అదెప్పుడు అన్న విషయంపై మాత్రం బోలెడంత కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పే రాజగోపాల్ రెడ్డి.. తాను పార్టీ మారితే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పటం తెలిసిందే. ఇప్పుడు పార్టీ మారితే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. మొదటికే మోసం రావటమే కాదు.. ఇప్పుడున్న ఇమేజ్ మొత్తం సంక నాకిపోవటం ఖాయం. అందుకే.. పార్టీ మారాలా? వద్దా? ఎన్నికల వేళ మారాలా? లాంటి సందేహాలతో బీజేపీలో చేరే ప్రోగ్రాంను ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారన్న మాట వినిపించేది. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి తాజాగా హైదరాబాద్ రావటం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మాణిక్యం ఠాగూర్ ను కలిసిన సందర్భంలో తాను పార్టీ మారటం లేదన్న మాటను తనదైన శైలిలో చెబుతూ.. అధిష్ఠానంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పటం.. అందుకు భిన్నంగా ఇప్పుడు అమిత్ షాతో భేటీ అయి రావటం చూస్తే.. పార్టీ మారే అంశంపై త్వరలోనే కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి..

కేసీఆర్ ను ఓడించే గట్టి పార్టీలో ఉంటానని. బీజేపీలో చేరే అంశంపై తాను గతంలోనే చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.పార్లమెంటు ఆవరణలో అమిత్ షాతో భేటీ జరిగిందని.. పార్టీ మారే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ మరోసారి టీ కాంగ్రెస్ లో కాకకు కారణమైందని చెప్పక తప్పదు.