Begin typing your search above and press return to search.

బోర్డులు పెడితే సరిపోతుందా కొల్లు?

By:  Tupaki Desk   |   16 July 2016 9:36 AM GMT
బోర్డులు పెడితే సరిపోతుందా కొల్లు?
X
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ విద్యార్థులు పూటుగా తాగేసి ర్యాష్ గా కారును డ్రైవ్ చేస్తూ డివైడర్ ను ఢీ కొని కారు బోల్తా పడిన ఘటనలో చిన్నారి రమ్య మరణించిన సంగతి తెలిసిందే. చిన్నారి చనిపోవటంతో పాటు.. ఆ కుటుంబానికి జరిగిన నష్టం గురించి తెలిసిన వారంతా విపరీతమైన బాధకు గురైన పరిస్థితి. ఈ ఘటనలో షాకింగ్ అంశం ఏమిటంటే.. పూటుగా మందు తాగి ర్యాష్ గా డ్రైవ్ చేసి పలువురు మరణానికి కారణమైన ఇంజనీరింగ్ విద్యార్థులు మైనర్లు కావటం.. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తటంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

బార్లలో మైనర్లకు మద్యం అమ్మకూడదన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే.. రమ్య మరణం తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. తెలంగాణలో చోటు చేసుకున్న ఉదంతం లాంటిది ఏపీలో చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్సందించారు. ఏపీలోని అన్ని మద్యం దుకాణాల్లో మైనర్లకు మద్యం అమ్మకూడదని.. దీనికి సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే.. మద్యం దుకాణాల్లో బోర్డులు పెట్టిస్తేనే మార్పు వస్తుందని కొల్లు అనుకుంటే తప్పులో కాలేసినట్లని పలువురు తప్పు పడుతున్నారు. మద్యం దుకాణాల్లో మైనర్లకు మద్యం అమ్మకుండా బోర్డులు పెట్టించటం లాంటివి చేస్తేనే సరిపోదని.. నిబంధనల్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందన్న విషయాన్ని కొల్లు గుర్తిస్తే మంచిది.