Begin typing your search above and press return to search.

శార‌దా కుంభ‌కోణం బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

By:  Tupaki Desk   |   4 Feb 2019 4:22 AM GMT
శార‌దా కుంభ‌కోణం బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
X
ప‌శ్చిమ‌బెంగాల్ లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో దేశ ప్ర‌జ‌లంతా ఇప్పుడు దీదీ స్టేట్ మీద దృష్టి సారించేలా చేశాయి. సెల‌వు రోజున ఎవ‌రి బిజీలో వారున్న వేళ‌.. ప‌శ్చిమ‌బెంగాల్ లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు నోటిఫికేష‌న్ల రూపంలో మొబైల్ లోకి వ‌స్తున్న వేళ‌.. చాలామంది త‌మ ప‌నుల్ని ప‌క్క‌న పెట్టేసి మ‌రీ.. వాటిని ఆస‌క్తిగా చూడ‌ట‌మే కాదు..మోడీ మాష్టారికి అస‌లుసిస‌లైన షాకిచ్చే ప్ర‌త్య‌ర్థి అంటే ఎలా ఉంటుందో చేత‌ల్లో చూపించారు మ‌మ‌తా బెన‌ర్జీ.

శార‌దా కుంభ‌కోణంలో కోల్ క‌తా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ను ప్ర‌శ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయ‌న ఇంటికే వెళ్లిన నేప‌థ్యంలో.. అక్క‌డి పోలీసులు వారిని అడ్డుకోవ‌ట‌మే కాదు.. వారిని జీపులో ప‌డేసి పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లిన అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. అస‌లు దీనంత‌టికి కార‌ణం శార‌దా కుంభ‌కోణం.. రోజ్ వ్యాలీ కుంభ‌కోణాలు. ఇంత‌కీ ఈ స్కాంల అస‌లు క‌థేంటి? ఈ రెండింటి తీవ్ర‌త ఎంత‌? ఎంత‌మంది ప్ర‌జ‌లు ఈ కుంభ‌కోణాల కార‌ణంగా దెబ్బ తిన్నారు? అస‌లీ కుంభ‌కోణాల అస‌లు క‌థేమిటి? అన్న‌ది చూస్తే..

+ 200మంది ప్రైవేటు వ్యక్తులు పశ్చిమబెంగాల్‌ లో శారదా గ్రూప్‌ పేరిట కంపెనీని స్థాపించారు. చైన్ సిస్టంతో న‌డిచే ప‌థ‌కాల‌తో అమాయ‌క ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించారు. త‌మ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెడితే భారీ లాభాలు వ‌స్తాయ‌ని ఆశ చూపారు. వారి మాయ‌లో ప‌డిన దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని త‌మ దుర్మార్గంతో దోచుకున్నారు.

+ దాదాపు రూ.10వేల కోట్ల‌కు పైగా ప్ర‌జ‌ల క‌ష్టాన్ని దోచేసిన ఈ స్కాం తొలుత యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న 2013లో వెలుగు చూసింది. దీదీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన ఈ స్కాం సంగ‌తి చూసేందుకు.. అమాయ‌క ప్ర‌జ‌ల్ని ఆదుకునేందుకు వీలుగా రూ.500 కోట్ల ప్ర‌త్యేక నిధిని రాష్ట్ర స‌ర్కారు ఏర్పాటు చేసింది.

+ ఈ స్కాంలో ప‌లువురు తృణ‌మూల్ ఎంపీల‌కు భాగ‌స్వామ్యం ఉందంటూ ఆరోప‌ణ‌లు రావ‌టం.. అవి నిజ‌మేనంటూ పోలీసుల విచార‌ణ‌లోనూ తేలింది. శార‌దా చిట్స్ కంపెనీ ఛైర్మ‌న్ క‌మ్ ఎండీ అయిన సుదీప్ సేన్ తో పాటు.. కంపెనీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల్ని 2013 ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు ప‌లువురు ఈ కుంభ‌కోణంలో పాత్ర‌దారులంటూ పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

+ ఈ స్కాంలో పశ్చిమ‌బెంగాల్ మాజీ డీజీపీ ర‌జ‌త్ మ‌జుందార్ కూ ముడుపులు అందిన‌ట్లుగా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. స్కాం వెనుక పెద్ద‌ల క‌త‌ను బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా సెబీ.. ఆర్ బీఐ.. ఐటీ.. ఈడీ.. సీబీఐలు రంగంలోకి దిగాయి.

+ ఈ స్కాంలో పాత్ర ఉన్న‌ట్లుగా ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ మంత్రి మ‌తంగ్ సింగ్ స‌తీమ‌ణి మ‌నోరంజ‌న్ సింగ్ పైన కేసులు న‌మోద‌య్యాయి.

+ ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. మ‌నోరంజ‌న్ సింగ్ పై న‌మోదైన కేసుల్ని వాదించేందుకు ఓకే చేసిన ప్ర‌ముఖ న్యాయ‌వాది న‌ళిని చిదంబ‌రానికి చిక్కులు ఎదురుకావ‌టం. ఈ కేసును వాదించ‌టానికి ఆమె ఫీజుగా రూ.1.26 కోట్ల మొత్తాన్ని తీసుకున్నార‌ని.. ఆ మొత్తం శార‌దా కుంభ‌కోణానికి సంబంధించిందంటూ ఈడీ కేసు పెట్టింది. ఈ కేసూ ఇప్పుడు న‌డుస్తోంది.

+శార‌ద కుంభ‌కోణం ప‌శ్చిమ‌బెంగాల్ ను దాటి ఒడిశాకు చేరింది. అక్క‌డ బాధితులు ఉన్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీదీకి ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉండే కేంద్ర మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ ను సీబీఐ ఇప్ప‌టికే ప‌లుమార్లు ఇదే అంశంపై ప్ర‌శ్నించింది. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలోఉన్నారు.

+ దీదీకి అండ‌గా ఉన్నారా? మీ సంగ‌తి ఇంతే అన్న‌ట్లుగా బెదిరించే ధోర‌ణిలో మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్న ప‌రిస్థితి.

+ శార‌దా చిట్స్ స్కాంతో ఇబ్బంది ప‌డుతున్న దీదీ స‌ర్కారుకు రూ.40వేల కోట్ల మేర కుంభ‌కోణం జ‌రిగిందంటూ తెర పైకి వ‌చ్చిన రోజ్ వ్యాలీ స్కాం మ‌రో సంచ‌ల‌నంగా మారింది. ఇది కూడా చైన్ సిస్టంలో ప‌థ‌క‌మే. ప్లాట్ల కొనుగోలు చేయాల‌నుకునే వారికి.. టూర్ల‌కు వెళ్లే వారిని ల‌క్ష్యంగా చేసుకొని క‌మిష‌న్ ప‌ద్ద‌తిలో.. చైన్ సిస్టంలో స‌భ్యులుగా చేరుస్తారు.

+ నిర్ణీత కాల‌వ్య‌వ‌ధి తీరిన వెంట‌నే డ‌బ్బులు క‌ట్టిన వారికి 21 శాతం వ‌డ్డీ ఇస్తామ‌ని ఆశ చూపించారు. దాదాపు రూ.40 వేల కోట్ల‌ను ప్ర‌జ‌ల నుంచి స‌మీక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. రోజ్ వ్యాలీ సంస్థ రియ‌ల్ ఎస్టేట్‌.. నిర్మాణ రంగం.. హోట‌ల్స్ త‌దిత‌ర వ్యాపారాలు చేస్తున్న‌ట్లుగా చెప్పి భారీ ఎత్తున నిధులు స‌మీక‌రించాయి.

+ ఈ తీరులో నిధుల్ని స‌మీక‌రించ‌టం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని సెబీ పేర్కొంది. సెబీ ప్ర‌క‌ట‌న‌తో నిధుల స‌మీక‌ర‌ణ‌ను 2013.. 2014ల‌లో ఆపేశారు. ఈ వ్య‌వ‌హారంలో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు చెందిన త‌ప‌స్పాల్.. సుదీప్ బందోపాధ్యాయల‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరితోపాటు రోజ్ వ్యాలీ గ్రూప్ ఛైర్మ‌న్ గౌతం కుందు కూడా ఉన్నారు.