Begin typing your search above and press return to search.

కోహ్లీ అనూహ్య నిర్ణయం.. షాకుల మీద షాకులిస్తున్నాడుగా?

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:49 AM GMT
కోహ్లీ అనూహ్య నిర్ణయం.. షాకుల మీద షాకులిస్తున్నాడుగా?
X
ఫలానా కారణమని స్పష్టంగా చెప్పటం లేదు కానీ.. పని భారం తగ్గించుకోవటం కోసం పదవుల నుంచి తప్పుకుంటున్నట్లుగా చెబుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. తాజాగా మరోసారి షాకిచ్చాడు. గత గురువారం భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లుగా ప్రకటించిన ఆయన.. ఆ షాకు నుంచి తేరుకోకముందే మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆర్ సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అతను.. ఈ సీజన్ ముగిశాక.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లుగా ప్రకటించాడు.

దీనికి సంబంధించి ఆర్ సీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో కోహ్లీ తన వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఆర్ సీబీ కెప్టెన్ గా తనకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని.. గతంలో చెప్పినట్లుగా ఐపీఎల్ లో చివరి మ్యాచ్ ఆడినంత కాలం ఆటగాడిగా బెంగళూరు జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. మరో ఐపీఎల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనని మరోసారి స్పష్టం చేశాడు. ‘ఇంతకాలం నాపై నమ్మకం ఉంచి.. నన్ను ప్రోత్సహించి.. మద్దతుగా నిలిచిన ఆర్ సీబీ యాజమాన్యానికి.. కోచ్ లకు.. సహచర ఆటగాళ్లకు.. అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఆర్ సీబీ జట్టుకు నాయకత్వం గొప్ప.. స్ఫూర్తిదాయక ప్రయాణమని పేర్కొన్న కోహ్లీ.. బెంగళూరు కెప్టెన్ గా ఇదే తనకు ఆఖరి ఐపీఎల్ అన్నారు. ‘ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ.. ఫ్రాంచైజీ ప్రయోజనాల కోణంలో సరైందని భావిస్తున్నా’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కోహ్లీబెంగళూరు జట్టుకు గొప్ప ఆస్తి అని.. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆ ఫ్రాంచైజీ ఛైర్మన్ ప్రథమేశ్ మిశ్రా చప్పారు. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. 2013లో డానియల్ వెటోరి నుంచి సారథ్య బాధ్యతల్నిస్వీకరించిన కోహ్లీ.. పని భారం తగ్గించుకోవటం కోసమే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పాడు.

బెంగళూరు జట్టు తరఫున కోహ్లీ ఇప్పటివరకు 199 మ్యాచులు ఆడారు. ఐదు సెంచరీలతో సహా 6076 పరుగులు చేశారు. ఈ రోజు (సోమవారం)కోల్ కతా నైట్ రైడర్స్ తో అతను ఆడనున్నది 200 ఐపీఎల్ మ్యాచ్ కావటం విశేషం. కోహ్లీ సారథ్యంలో ఆర్ సీబీ జట్టు 132 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడింది. 60 విజయాలు.. 65 పరాజయాలు నమోదు చేయగా.. మూడు మ్యాచ్ లు టై అయ్యాయి. నాలుగు మ్యాచ్ లు రద్దు అయ్యాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్ సీబీ 2015లో మూడో స్థానంలో.. 2016లో రన్నరప్గా.. 2020లో నాలుగో స్థానంలో నిలిచింది.