Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ త‌న‌యుడు దూకుడు పెంచాడు

By:  Tupaki Desk   |   6 Aug 2016 4:29 AM GMT
స్పీక‌ర్ త‌న‌యుడు దూకుడు పెంచాడు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న సభాపతి కోడెల శివ‌ప్ర‌సాద్ రావు తనయడు డాక్టర్‌ శివరాం రాజ‌కీయ అరంగేట్రంలోనే జోరు పెంచేస్తున్నారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన‌ స్పీక‌ర్ ప‌ద‌విలో కోడెల ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న‌యుడు ప్ర‌త్యేక హోదా నినాదం అందుకున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తెదేపా - ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు సమష్టిగా పోరాటం సాగిద్దామని కోడెల త‌న‌యుడు పిలుపునిచ్చారు.

న‌ర‌స‌రావుపేట పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో నాయకులు - కార్యకర్తలు - అభిమానులు పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం అనంతరం అంబేడ్కర్‌ తదితర నాయకుల విగ్రహాలకు శివరాం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడుతూ విభ‌జ‌న వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునే స‌మ‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు బాధాక‌ర‌మని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు తలచుకుంటే అనుకొన్నది సాధిస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చేస్తున్న కృషికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాట స్పూర్తి - ఐక్య‌తతో తెలుగువారి సత్తా చాటాల‌ని సూచించారు.ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ పట్టణ అధ్యక్షుడు మాజేటి వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన అంధ్రుల హక్కు అన్నారు. వ్యాపార - విద్యా - స్వచ్ఛంద సంస్థలు హోదా సాధన కోసం ఉద్యమం సాగించాలన్నారు.