Begin typing your search above and press return to search.

గొంతు నొక్కేసినా నిల‌బ‌డ‌తామంటున్న మాష్టారు

By:  Tupaki Desk   |   4 March 2017 2:59 PM GMT
గొంతు నొక్కేసినా నిల‌బ‌డ‌తామంటున్న మాష్టారు
X
నిరుద్యోగ సమస్యలపై తాము చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేసే కుట్రలో రాష్ట్ర వ్యాప్తంగా 13వేల మందిని అరెస్ట్ చేశారని, అయినా తమ గొంతులను మాత్రం నొక్కలేక పోయారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. ప్రశ్నించే గొంతులు ఉండొద్దనే భావనలో పాలకులు ఉన్నారని, చేతనైతే చప్పట్లు కొట్టాల్సిందేనని, అవసరమైతే పాలాభిషేకం - పాదాభిషేకాలు చేస్తే ఇంకా సంతోషిస్తారని, అంతేకాని ప్రశ్నించడం మాత్రం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ తదననంతరం పరిణా మాలపై కోదండరామ్ ఫేస్‌ బుక్‌ లో 8 నిమిషాల వీడియో మెసేజ్ ద్వారా స్పందించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి తమపై అనేక రూపాల్లో దాడులకు పాల్ప డుతున్నారని ఆయన విమర్శించారు.

అనేక నిర్భందాలు - అరెస్టులు చేసినా నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్రజల నుంచి అపురూప స్పందన లభించిందనే పాలకులు కుట్రతో జేఏసీని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోదండ రామ్ ఆరోపించారు. జేఏసీ ఐక్యంగానే ఉందని, తమ ప్రయాణం యథావిధిగానే కొనసాగిస్తూ జేఏసీని సంఘటితంగా నిలబెట్టుకుంటామని ఆయ‌న స్పష్టం చేశారు. తమ కార్యకలాపాలను యథావిధిగానే నిర్వహించే స్థితిలో శక్తివంతంగానే ఉన్నామన్నారు. ప్రజల గొంతుకను నిరంతరం వినిపించేందుకు తమ కృషి ఎప్పటికీ ఉంటుందన్నారు. వర్తమాన పరిణామాలు జేఏసీని లేకుండా చేసే కుట్రగా గ్రహించాలని కోదండ రామ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ది - వారి పురోభివృద్ధికి - ప్రజలందరికీ మేలు జరిగేలా తమ పని తాము కచ్చితంగా కొనసాగిస్తామని అన్నారు. తాము గట్టిగా మాట్లాడుతున్నందునే పాలకులు ఉలికిపడుతున్నారని, పడి ఉంటారనుకున్న ప్రజలు ప్రశ్నించడం పాలకులకు ఇష్టం లేదనిఇలాంటి బెదిరింపులు ప్రజలకు, జెఎసికి కొత్త కాదని చెప్పారు.ఇలాంటి క్రమంలో జేఏసీ నిలబడి ప్రశ్నించిందన్నారు.

నిరుద్యోగ ర్యాలీతో నిరుద్యోగ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లామని ఆయ‌న చెప్పారు. అధికారాన్ని నిలదీయడాన్ని ఏలినవారు సహించ లేకపోవడమే వర్తమాన పరిణామాలకు ఏకైక కారణమన్నారు. గతంలోనూ జేఏసీని లేకుండా కుట్రలు పన్నినా పడిపోలేదని, కూలిపోలేదని, ఇప్పుడూ మరోసారి అదే ప్రయత్నం జరిగింద న్నారు. జేఏసీ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడం లేదని, ఎలాంటి ఇబ్బందులూ లేవనేది అందరూ గ్రహించాలన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించే వరకు జేఏసీ నిద్రపోదని స్ప‌ష్టం చేశారు. పలు ఆంక్షల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అదే తరహా లో సామాజిక తెలంగాణకు కృషి కొనసాగుతుందన్నారు. నిరసన ర్యాలీకి ముందు మూడు రోజుల పాటు జెఎసి నేతల అరెస్టుల పర్వం కొనసాగిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోలీసులు తన ఇంటికి రాలేదని, అలాంటిది తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారని ఆయన వివరించారు. ర్యాలీ సందర్భంగా అనేక ఆంక్షలను విధించి, తమ నినాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేసిందన్నారు. తాము చేసిన ప్రయత్నం వల్ల ర్యాలీ డిమాండ్లను అందరికీ తెలిసిపోయిందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/