Begin typing your search above and press return to search.

లోకేష్ పందికొక్కులా తిన్నాడు, అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే: కొడాలి నాని

By:  Tupaki Desk   |   13 Jun 2020 4:00 PM GMT
లోకేష్ పందికొక్కులా తిన్నాడు, అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే: కొడాలి నాని
X
వైసీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఈఎస్ఐ స్కాంకు సంబంధించి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, లోకేష్‌లు పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.

ఇందులో అచ్చెన్నాయుడికి రూ.5 కోట్లో లేదా రూ.10 కోట్లో ఇచ్చి ఉంటారని, మిగతా మొత్తాన్ని లోకేష్ పందికొక్కులా తినేసి ఉంటాడన్నారు. ఈఎస్ఐలో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇష్టారీతిన కొనుగోలు చేసి జేబులు నింపుకున్నారన్నారు. అచ్చెన్నాయుడికి కొంతమాత్రమే ఇచ్చి, మిగతా అంతా లోకేష్ జేబులోకి వెళ్తుందన్నారు.

అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారి ఈఎస్ఐ స్కాం వెనుక ఉన్న వారి పేర్లు చెబితే అతనిని వదిలేసి, మిగతా పందికొక్కులను పట్టుకుంటామన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టుపై చంద్రబాబు, లోకేష్‌లు విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టారు. ఎవరిని అరెస్టు చేయాలో, ఎవరిని చేయవద్దో చంద్రబాబు జాబితా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అవినీతికి ఆస్కారం లేదన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను విచారిస్తున్నామని చెప్పారు.

అచ్చెన్నాయుడు బీసీ నేత అని చెప్పడంపై కూడా కొడాలి నాని స్పందించారు. బీసీ నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, అక్రమాలు, అవినీతి చేసినప్పుడు అడ్డురాని కులాలు, మతాలు, అరెస్ట్ చేస్తే వచ్చాయా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ సమయంలో ఏసీపీ అధికారులు, పోలీసులు తీసుకున్న చర్యలను ఆయన సమర్థించారు.