Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘దాపరికం’పై చర్చ షురూ చేసిన కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   26 April 2021 4:30 AM GMT
కేసీఆర్ ‘దాపరికం’పై చర్చ షురూ చేసిన కిషన్ రెడ్డి
X
డాక్టర్ దగ్గర.. లాయర్ దగ్గర నిజాల్ని దాచకూడదంటారు. దాని వల్ల నష్టం డాక్టర్.. లాయర్ కంటే వారి క్లయింట్లకే ఇబ్బంది. ఈ సింఫుల్ లాజిక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీదా? కరోనా నేపథ్యంలో తెలంగాణలో నమోదయ్యే కేసులతో పాటు చోటు చేసుకునే మరణాలపై మొదట్నించి సెన్సార్ ఉందన్న ఆరోపణ ఉంది. ఇప్పటికే ఇదే విషయంపైన కొన్ని మీడియా సంస్థలు కౌంటర్లు సంధించాయి కూడా. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి అధికారికంగా కాకున్నా.. తమ సొంత మీడియా సంస్థలో రాయించిన రాతల్లో తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు.

అందులో ముఖ్యమైనది సంక్షోభంలో ప్రజలకు ఆందోళన కలిగించేలా.. భయాన్ని పెంచేలా వాస్తవాల్ని వెల్లడించటం మంచిది కాదంటూ మీడియా సైతం సంయమనం పాటించాలన్న సూచన చేయటం కనిపిస్తుంది. అయితే.. ఈ వాదనకు ప్రతివాదన మరొకటి ఉంది. అదేమంటే.. సంక్షోభం.. విపత్తు వేళలో నిజాల్ని నిర్భయంగా చెప్పటం.. జరుగుతున్న ఇబ్బందుల్ని.. ప్రజలు పడుతున్న కష్టాల్ని నిజాయితీగా తెలియజెప్పి.. పాలకులుగా తాము చేస్తున్న ప్రయత్నాల్ని చెప్పేస్తే.. ప్రజలు అర్థం చేసుకుంటారే తప్పించి అపార్థం చేసుకోరు.

కరోనా లాంటిది ఇంతకు ముందు చూసింది లేదు. ఇలాంటి విలయాన్ని ఎదుర్కోవటంలో పాలకులకు ఉండే ఇబ్బందుల్ని పరజలు అర్థం చేసుకోలేనంతగా ఏమీ లేదు. కుడుము ఇస్తే సంతోషపడే ప్రజలు.. విపత్తు వేళ.. నిజాయితీతో పని చేసే ప్రభుత్వాన్ని ఎవరూ వేలెత్తి చూపించలేరు. అయినప్పటికి ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. అందునా.. కేసీఆర్ లాంటి బలమైన ప్రజాకర్షణ ఉన్న అధినేత ఇలాంటి వాటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు.

అయినప్పటికి కేసుల నమోదు మొదలు మరణాల వరకు నిజాల్ని దాచేసే వైనంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కేసులు తక్కువగా నమోదు అయినట్లుగా చూపించటం ద్వారా.. ప్రజల్లో వైరస్ వ్యాప్తి పెద్దగా లేదన్న భావన కలగటంతో పాటు.. అజాగ్రత్తకు ప్రభుత్వం కారణమవుతుందన్నది మర్చిపోకూడదు. విపత్తు వేళ.. విరుచుకుపడుతున్న వైరస్ తీవ్రత.. దాని కారణంగా పోతున్న ప్రాణాల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ద్వారా ప్రజల్లో అవగాహన కలగటమే కాదు.. ఎవరికి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయంపై ఒక స్పష్టత వచ్చే వీలుంది.

ఇదే వాదనను తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వినిపించారు. కరోనా కేసులు.. మరణాల వివరాల్ని దాచాల్సిన అవసరం లేదని.. వాస్తవాలు చెబితే ప్రజలు అప్రమత్తంగా ఉంటారన్న విషయాన్ని ఆయన చెప్పారు. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతకాలం కేసీఆర్ సర్కారు ‘గుట్టు’ సిద్ధాంతాన్ని బద్ధలు కొట్టేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఉందని చెప్పాలి.