Begin typing your search above and press return to search.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ ను.... ప్ర‌జాభ‌వ‌న్‌ గా మారుస్తాం..: కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   23 April 2022 4:33 PM GMT
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ ను.... ప్ర‌జాభ‌వ‌న్‌ గా మారుస్తాం..:  కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ‌లోని టీఆర్ ఎస్ అధికారిక భ‌వ‌నాన్ని తాము అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామ‌ని.. దీనిని ప్ర‌జా భ‌వ‌న్‌గా మారుస్తామ‌ని కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. టీఆర్ ఎస్ పాల‌న‌లో తెలంగాణ ఆత్మ గౌర‌వం త‌గ్గిపోయింద‌ని.. అదేస‌మ‌యంలో సీఎం క‌ల్వ‌కుంట్ల కుటుంబ గౌర‌వ‌మే పెరిగింద‌ని వ్యాఖ్యానించారు. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ టీఆర్ ఎస్‌ నేతలు పబ్బం గడుపుతున్నారని కిషన్‌ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ నేతల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.

ఇప్పుడు ప్రగతిభవన్ కల్వకుంట్ల ప్రగతిభవన్గా ఉందని.. దానిని భవిష్యత్లో తెలంగాణ ప్రజాభవన్గా మారుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ ఎస్‌ నాయకులు ఆందోళన చేస్తే లేని ఇబ్బంది.. బీజేపీ కార్యకర్తలు చేస్తే ఎందుకు వేస్తోందని ప్రశ్నించారు. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. సాయి గణేష్‌ ఓ సాధారణ కారు డ్రైవరని.. తన అమ్మమ్మ వద్ద ఉంటారని, నెలలో 15 రోజులు బీజేపీ కోసం పనిచేస్తారని వెల్లడించారు. పోలీసులు సాయి గణేష్‌పై 16 కేసులు పెట్టారని.. 3 సార్లు జైలుకు పంపించి రౌడీషీట్ తెరిచి వేధించారని ఆయన తెలిపారు.

ఖమ్మంలో కేటీఆర్‌ పర్యటన ఉంటే మూడ్రోజుల ముందే సాయి గణేష్‌ను పోలీసులు పీఎస్‌లో నిర్బంధించారన్నారు. పెళ్లి ఉంద న్నా వినకుండా సాయి గణేష్‌ను పోలీసులు వదలలేదని.. దీంతో మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ నేత వేధింపులకు ఖమ్మంలో ఓ కుటుంబమంతా ఆత్మ హత్య చేసుకుందని విమర్శించారు. మెదక్‌, కామారెడ్డిలోనూ టీఆర్ ఎస్ నేత‌ల‌ ఆగడాలకు వ్యక్తులు బలి అయ్యారన్నారు.

ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసే వారిపై రాష్ట్ర సర్కారు దౌర్జన్యాలు చేస్తోందని మండిపడ్డారు. ''టీఆర్ ఎస్‌ నేతలు ప్రధాని దిష్టిబొమ్మను తగలబెడతారు.. అదే మేము చేస్తే నిర్బంధిస్తారా?'' అంటూ ప్రశ్నించారు. కేంద్రంపై టీఆర్ ఎస్‌ నేతలు రోజూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంపై టీఆర్ ఎస్‌ నేతలు రోజూ బురద జల్లుతున్నారన్నారు. టీఆర్ ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి కోసం గజ్వేల్‌, సిరిసిల్లకు ఎంతిచ్చారు.. దుబ్బాకకు ఎంతిచ్చారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు వైద్యం కోసం ఆస్పత్రులు ఏర్పాటు చేశామని, జాతీయ రహదారులు వేశామన్న కేంద్ర మంత్రి.. రాష్ట్రంపై ఏ విధంగా వివక్ష చూపెట్టామో చెప్పాలని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు. రోడ్ల శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గత కొన్ని నెలలుగా అడుగుతున్నామని.. వారి ఆలస్యం వల్లే ఈ నెల 29న ఆ కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇవ్వాలని అడిగితే ఇప్పటివరకు అతీగతి లేదన్నారు.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటు చేస్తామంటే రాష్ట్ర సర్కారు ముందుకు రాలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభద్రతాభావంతో ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ, నరేంద్ర మోడీని ఏ విధంగా తిట్టాలనే కేసీఆర్ కుటుంబం ఆలోచిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్ల వద్ద మీటర్లు పెట్టాలని ఎవరూ అనలేదన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్నారు.

గత 8 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర సర్కారు 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నా రు. బీజేపీ సర్కారు దేశానికంతటికీ ఒకే పాలసీని తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ కేరళలో కూడా బాయిల్డ్ రైస్ ఎవరూ తీసుకోవడం లేదని.. రా రైస్ మాత్రం ఎంతైనా తీసుకుంటామన్నారు. పేదప్రజలకు ఫోర్టిఫైడ్ రైస్ అందాలనే గొప్ప ఉద్దేశంతో బీజేపీ సర్కారు యత్నిస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు ఒప్పందంపై సంతకం పెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మెడపై కత్తి పెడితే సంతకం పెట్టామని అంటున్నారని.. అసలు వారి మెడపై వేలు కూడా పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి చివరి గింజవరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య ఒక్క తెలంగాణలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడమే రాష్ట్ర సర్కారు పని అని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ గౌరవాన్నే పెంచుకున్నారని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తగ్గించారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో సెక్రటేరియట్కు రాకుండా ఉండడం ప్రజాస్వామ్యమా? అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. ఇప్పుడు ప్రగతిభవన్ కల్వకుంట్ల ప్రగతిభవన్గా ఉందని.. దానిని భవిష్యత్లో తెలంగాణ ప్రజాభవన్గా మారుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రజలు ఆ దిశగా ఆశీర్వదించాలని కోరారు.