Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం... అందరినీ ఏకం చేస్తున్న అధిష్టానం

By:  Tupaki Desk   |   27 Oct 2021 3:57 AM GMT
ఏపీ కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం... అందరినీ ఏకం చేస్తున్న అధిష్టానం
X
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సెకెండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారంట. కీలక పదవితో దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సంకల్పిస్తున్నారని, అందుకోసం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవితో రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నారని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర విభజనను ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టాన నిర్ణయాన్ని కాదలేక పోయారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోతామని హెచ్చరించారు. ముఖ్యంగా తెలంగాణకు విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోతుందని, తెలంగాణకు కరెంటే రాదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే ప్రయోజనాల పై కాంగ్రెస్ ముందుగానే లెక్కలు వేసుకుంది. దాన్ని అనుసరించే ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది.

అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కు రాజీనామా చేశారు. ‘జై సమైఖ్యాంద్ర’పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టారు.

ఆయనలో సహా ఏ ఒక్కరు కూడా గెలువలేక పోయారు. ఎన్నికల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన, ఇలా అన్ని పార్టీల్లో ఆయన పేరు వినిపించింది. ఈ క్రమంలోనే మాజీమంత్రి సాకే శైలజానాథ్ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తున్న సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న దిగ్గజాలను అధిష్టానం ఏకం చేసింది. తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలని ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కిరణ‌్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంత గూటికి దగ్గరయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించిన సందర్భాలు కనిపించలేదు.

అయితే ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో తిరిగి క్రియా శీల పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నాయి. ఆయనకు ఏపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి కాంగ్రెస్‌ కు పూర్వ వైభవాన్ని తేవాలని ఆ పార్టీ భావించింది. అయితే ఆయన పీసీసీ పదవి పై విముఖత వ్యక్తం చేశారంట. తనకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గాని సీడబ్ల్యూసీ మెంబర్‌గా, లేకపోతే సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి గాని ఇవ్వాలని ప్రతిపాదను పెట్టారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పచ్చజెండా ఊపిందని చెబుతున్నారు. త్వరలో ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులతో సోనియాగాంధీ సమావేశం కానుందని, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పదవుల పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాల పై కిరణ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.