Begin typing your search above and press return to search.

ఉత్తర కొరియా : కరోనా సంగతి బయటపడిందా .. ఆ సీనియర్ అధికారులను తొలగించిన కిమ్ !

By:  Tupaki Desk   |   30 Jun 2021 11:30 AM GMT
ఉత్తర కొరియా : కరోనా సంగతి  బయటపడిందా .. ఆ సీనియర్ అధికారులను తొలగించిన కిమ్ !
X
నార్త్ కొరియా ఈ పేరు వినగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి. దీనికి ప్రధాన కారణం , ఆ దేశం మన భూమిపైనే ఉన్నా మరో ప్రపంచం. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంతర్జాతీయ వార్తలపై అవగాహన ఉండదు. కేవలం వారికి వారి అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు గురించి మాత్రమే తెలుసు. ఆ దేశంలో జరిగే అరాచకాల గురించి తెలుసుకుంటే.. అది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా, మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌‌ను అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు... ఇష్టం ఉన్నా లేకున్నా కూడా దైవంగా భావించాలి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలోని ప్రతి దేశం పరిస్థితి అన్ని దేశాలకి తెలిసింది. కానీ ఇప్పటివరకు నార్త్ కొరియా లో కరోనా ఏ రేంజ్ లో ఉందొ ఎవరికీ తెలియదు. కానీ తోలిసారిగా దీని ప్రభావం ఈ దేశంలో ఉందని తేలింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పలువురు సీనియర్ అధికారులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. ఈ అధికారులు తమ విధులను నిర్లక్ష్యం చేశారని, దేశ ప్రజల రక్షణ విషయంలో పెను సంక్షోభానికి కారకులయ్యారని, వీరి కారణంగా దేశంలో తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయని తమ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వీరి బాధ్యతా రాహిత్యం, సామర్థ్య లోపం ప్రధాన లక్ష్యాల అమలును దెబ్బ తీశాయని, స్వీయ రక్షణ, ఉదాసీనత వారిలో పెరిగాయని ఆయన ఆరోపించినట్టు సమాచారం.

మంగళవారం పాలక వర్కర్స్ పార్టీ, పొలిట్ బ్యూరో ప్రిసీడియం సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన అధికారుల బదిలీ, కొత్త్తవారి నియామకాల గురించి ప్రకటించారు. మొత్తానికి నార్త్ కొరియాలో కోవిద్ కేసులు ఉన్నాయని ధృవీకరించినట్టు అయిందని ఈ పరిణామాలను పరిశీలించిన ఓ విశ్లేషకుడు తెలిపారు. బహుశా ఈ దేశానికి ఇప్పుడు అంతర్జాతీయ దేశాల సహాయం అవసరం అవుతుందని భావిస్తున్నానని ఆయన చెప్పాడు. కరోనా కారణముగా ఇతర దేశాలతో గల తన సరిహద్దులను నార్త్ కొరియా మూసివేసింది.