Begin typing your search above and press return to search.

కేంద్ర మాజీ మంత్రికి ఒకే ఒక్క ఆశ...?

By:  Tupaki Desk   |   23 April 2022 1:30 AM GMT
కేంద్ర మాజీ మంత్రికి ఒకే ఒక్క ఆశ...?
X
ఆమె కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఒకనాడు దిగ్గజ నేత కింజరాపు ఎర్రన్నాయుడుని సైతం ఓడించారు. ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి. ఓడలు బళ్ళు అయినట్లుగా గత దశాబ్దంగా ఆమె రాజకీయ జీవితం సాఫీగా లేదు. 2014లో వైసీపీలోకి రమ్మంటే కాంగ్రెస్ లో ఉండిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు, కానీ టికెట్ అయితే దక్కలేదు.

దాంతో మూడేళ్ళుగా ఆమె శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇపుడు తాజాగా ఆ పదవిని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కి అప్పగించారు. ఆయన ధూం ధాం గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉన్న ఆ పదవీ ఆమెకు ఇపుడు పోయింది.

దాంతో ఆమెకు వైసీపీ హై కమాండ్ ఏమిచ్చి న్యాయం చేస్తుంది అన్నది చర్చగా ఉంది. కృపార‌ణి అయితే తనకు రాజ్యసభ సీటు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. దాని కోసం ఆమె ఈ మధ్యనే తాడేపల్లి దాకా వెళ్ళి సీఎం జగన్ని కలసి వచ్చారు. హామీ దక్కిందో లేదో కానీ ఆమె మాత్రం ఆశతోనే ఉన్నారు.

మరి కొద్ది నెలల్లో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ నుంచి నలుగురికి చాన్స్ ఉంది. అందులో బీసీ మహిళ కోటాలో, ఉత్తరాంధ్రా జిల్లాల తరఫున కిల్లి కృపారాణి పేరు ఉందని అంటున్నారు. ఆమె వృత్తి రిత్యా డాక్టర్, పైగా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్న వారు. దాంతో పెద్దల సభలో ఆమె ఉంటే వైసీపీకి అసెట్ అవుతారు అన్న అంచనాలు ఉన్నాయి.

జగన్ సైతం కృపారాణికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అంటున్నారు. పైగా ఇప్పటిదాకా నామినేట్ చేసిన వారిలో ఒక్క మహిళ కూడా లేదు. పైగా బీసీ కోటా కూడా అదనంగా ఉంది. దాంతో నూటికి తొంబై తొమ్మిది శాతం కృపారాణికి రాజ్యసభ సీటు ఖాయమనే అంటున్నారు. మరి ఎక్కడైనా సామాజిక రాజకీయ సమీకరణలు మారితే మాత్రం ఆమె మరో రెండేళ్ళ పాటు ఇలాగే నిరీక్షించాల్సిందే. ఏది ఏమైనా జగన్ కృప ఉంటుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది అంటున్నారు.