Begin typing your search above and press return to search.

ఆ దేశాధ్యక్షుడ్ని ఏసేస్తే రూ.7.25కోట్లు

By:  Tupaki Desk   |   10 Jun 2016 4:51 AM GMT
ఆ దేశాధ్యక్షుడ్ని ఏసేస్తే రూ.7.25కోట్లు
X
ప్రపంచ డ్రగ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ అయిన దేశం ఫిలిప్పీన్స్. ఆ దేశంలో డ్రగ్ మాఫియా ఎంత భయంకరమైనదంటే.. వారు ప్రభుత్వానికంటే బలమైన వారిగా చెబుతారు. అత్యంత కిరాతకంగా వ్యవహరించే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిపై ఆ దేశాధ్యక్షుడైన రోడ్రిగో డుటెర్ట్ ఇటీవల యుద్ధం ప్రకటించారు. ఇది వారికి ఏమాత్రం రుచించటం లేదు. డ్రగ్ డీలర్లపై ఉక్కుపాదం మోపటంతో పాటు.. డ్రగ్ డీలర్లను ఎవరైనా చంపితే వారికి భారీ పారితోషికం ఇవ్వటం లాంటివి చేస్తున్నారు.

దీంతో.. డ్రగ్ మాఫియాకు చిరాకెత్తించింది. తమ స్థాయిని మర్చిపోయి మరీ దేశాధ్యక్షుల వారికి స్పాట్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ముందు వెనుకా చూసుకోకుండానే దేశాధ్యక్షుల్ని ఏసేయాలంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారట. అధ్యక్షుల వారిని హత్య చేస్తే రూ.కోటిన్నర ఇస్తామని మొదట్లో ప్రకటించినా.. ఎవరూ ముందుకు రాకపోవటంతో ఇప్పుడీ మొత్తం రూ.7.25 కోట్లకు చేరిందట. డ్రగ్ మాఫియా అంతు చూసే విషయంలో ఏ మాత్రం తగ్గని అధ్యక్షుల వారిని మట్టుబెడితేనే తమ కార్యకలాపాలు నిరాటంకంగా చేపట్టొచ్చని వారు భావిస్తున్నారట. అందుకే ఇంత భారీ ఆఫర్ ను ప్రకటించినట్లుగా చెబుతున్నారు. దేశాధ్యక్షుల వారిని హత్య చేసేందుకు డ్రగ్ మాఫియా భారీగా ప్లాన్ చేస్తున్న సంచలన విషయాన్ని ఆ దేశ పోలీస్ చీఫ్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రొనాల్డ్ డెలా రోసా చెప్పటం ఇప్పుడా దేశంలో సంచలనంగా మారింది. తాను బాధ్యతలు స్వీకరించిన ఆర్నెల్ల వ్యవధిలోనే డ్రగ్ మాఫియా ఆటలు కట్టించినట్లుగా చెప్పుకున్నపోలీస్ బాస్..డ్రగ్ డీలర్లను తుదముట్టిస్తే భారీ నగదు బహుమతులు ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.