Begin typing your search above and press return to search.

బాబు అనుకూల-వ్య‌తిరేకంగా చీలిన వైసీపీ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   20 May 2016 9:46 AM GMT
బాబు అనుకూల-వ్య‌తిరేకంగా చీలిన వైసీపీ ఎమ్మెల్యేలు
X
విశాఖ‌మ‌న్యంలో బాక్సైట్ తవ్వ‌కం ఏపీలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య చీలిక‌కు దారితీసింది. బాక్సైట్ కేంద్రంగా వైసీపీ చెందిన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మ‌ధ్య ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. స‌ర్వేశ్వ‌ర‌రావు ఇటీవ‌లే తెలుగుదేశంలో చేర‌గా...ఈశ్వ‌రి వైసీపీలోనే కొన‌సాగుతున్నారు.

బాక్సైట్ త‌వ్వ‌కానికి మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా ఆదివాసుల‌కు న‌ష్టం చేసేందుకు కిడారి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గిడ్డి ఈశ్వ‌రి ఆరోపించారు. దీనిపై స్పందించిన స‌ర్వేశ్వ‌ర‌రావు విలేక‌రుల స‌మావేశంలో ఈశ్వ‌రి తీరుపై మండిప‌డ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉంటూ అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్‌ కు గురైనా.. తమ అందరి దయాదాక్షిణ్యాలతో రాజకీయ పదవి పొంది ఇప్పుడు తమపైనే బురదజల్లే కార్యక్రమాలు ఈశ్వ‌రి చేపడుతున్నారని మండిప‌డ్డారు. బాక్సైట్‌ తవ్వకాలు జరిగితే తొలి రాజీనామా తనదే ఉంటుందని చెప్పిన ఆయన బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని సీఎం తనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెప్పారు. పాడేరు ఎమ్మెల్యే అవినీతిపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించటంలా ఉందన్నారు. బాక్సైట్‌ పోరాటంపై ఆమెకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజీనామాకు సిద్ధపడాలని, ఇద్దరం రాజీనామా చేసి ఈ మూడేళ్ల పాటు ప్రజల వద్దకు వెళ్తామని కిడారి సవాల్‌ విసిరారు. తన సవాల్‌ కు సిద్ధపడితే ఈ నెల 30న చర్చ నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్‌ కు లేఖలు పంపుదామని చెప్పారు. స్పీకరు సమక్షంలో ఇద్దరి అవినీతిపై చర్చ జరగాలని, దీనికి ఆమె సిద్ధంగా ఉన్నారా అని ఆయన నిలదీశారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న తనపై పాడేరు ఎమ్మెల్యే చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

బాక్సైట్‌ పై ప్రభుత్వం స్పష్టంగానే ఉందని, ప్రతిపక్ష వైకాపా అనవసర రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షులు పప్పల చలపతిరావు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉండ‌టాన్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంద‌ని ఆయ‌న ఆక్షేపించారు.