Begin typing your search above and press return to search.

కిడారి హత్య..సన్నిహితులే సహకరించారా.?

By:  Tupaki Desk   |   30 Sep 2018 5:56 AM GMT
కిడారి హత్య..సన్నిహితులే సహకరించారా.?
X
నేటికి సరిగ్గా వారం రోజులు. అరకు ఎమ్మెల్యే కిడారి - మాజీ ఎమ్మెల్యే సోములను మావోయిస్టులు విశాఖ మన్యంలో దారుణంగా కాల్చిచంపి ఏడురోజులవుతోంది.. దీనిపై పోలీసుల రియాక్షన్ ఏదీ బయటకు రాలేదు. పెద్ద ఎత్తున బలగాలను ఏవోబీలోకి దింపినా ఇప్పటివరకూ ఎలాంటి ప్రతీకార దాడులు జరగలేదు. మరి ఈ వారం రోజుల్లో పోలీసులు ఏం చేశారు.? ఎలాంటి వ్యూహాలు పన్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మావోయిస్టులు ఆంధ్రాలోకి వచ్చి మరీ ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యేలను హతమార్చడంలో పోలీసుల ఘోర వైఫల్యం ఉందని అన్ని వైపులా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో డీజీపీ ఠాకూర్ దీనిపై సీరియస్ గా దృష్టిసారించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే హత్యకు ముందు అక్కడ స్థానికంగా డేటా కలెక్ట్ చేయగా.. ఎమ్మెల్యే కిడారికి బాగా సన్నిహితులైన వ్యక్తులే ఆయన కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ కిడారికి బాగా సన్నిహితులు కావడంతో ఇదో ప్రాధాన్య అంశంగా మారింది.

కాగా విశాఖ మన్యంలోకి మావోయిస్టులు రావడం.. హత్యలు చేయడం.. పోలీస్ స్టేషన్ ను గిరిజనులు తగుల బెట్టడంపై డీజీపీ ఠాకూర్ తీవ్ర మనస్తాపం చెందినట్టు వార్తలొస్తున్నాయి. పోలీసులతో శుక్రవారం నాటి భేటిలో డీజీపీ కలతతో ఉండడం చూసి పోలీస్ ఉన్నతాధికారులు కూడా షాకయ్యారట.. విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తోపాటు డీఐజీ శ్రీకాంత్ పనితీరుపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి. సకాలంలో స్పందించని వీరిని డీజీపీ నిలదీశారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులపై ప్రతీకార దాడులకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నట్టు సమావేశాన్ని బట్టి అర్థమవుతోంది.