Begin typing your search above and press return to search.

మనవాళ్ళు బ్రీఫ్డు మీ...గొంతు నిర్ధారించిన ఈడీ!

By:  Tupaki Desk   |   28 May 2021 8:30 AM GMT
మనవాళ్ళు బ్రీఫ్డు మీ...గొంతు నిర్ధారించిన ఈడీ!
X
దాదాపు ఆరేళ్ళక్రితం దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసుకు సంబంధించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా చార్జిషీటు ఫైల్ చేసింది. తెరమీద ప్రత్యక్షపాత్రను పోషించిన అప్పటి టీడీపీ ఎంఎల్ఏ, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి, అప్పటి టీడీపీ ఇప్పటి టీఆర్ఎస్ ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్యతో పాటు సెబాస్టియన్, కృష్ణ కీర్తనరెడ్డి, ఉదయసింహ, జెరూసలేం ముత్తయ్యలను నిందుతులుగా చార్జిషీటులో ఈడీ స్పష్టంగా చెప్పింది.

2015లో తెలంగాణాలో జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలో అప్పటి టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు రు. 5 కోట్ల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కుదిరిని ఒప్పందంలో భాగంగా ముందుగా రు. 50 లక్షల అడ్వాన్స్ ఇవ్వటానికి రేవంత్ స్టీఫెన్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలోనే ఏసీబీ ఉన్నతాధికారులు రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ తో పాటు ఆయన అనుచరుడిని పట్టుకున్నారు.

తర్వాత ఏసీబీతో పాటు ఈ కేసును దర్యాప్తుచేసిన ఈడీ మనీల్యాండరింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరిపింది. అనేక కోణాల్లో దర్యాప్తు తర్వాత ఫైనల్ గా చార్జిషీటు దాఖలుచేసింది. అయితే ఓటుకునోటు కేసు మొత్తానికి మూలం ఏమిటంటే ఓటువేయాల్సిన స్టీఫెన్ సన్ తో చంద్రబాబునాయుడు మాట్లాడటమే. ఓటుకునోటుకు రు. 5 కోట్ల బేరం కుదుర్చుకోవటంతో పాటు రేవంత్ అండ్ కో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చంద్రబాబు హామీఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీతోనే స్టీఫెన్ సన్ డబ్బుతీసుకోవటానికి అంగీకరించారు.

చంద్రబాబు-స్టీఫెన్ సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు వాస్తవమేనని ఈడీ తన చార్జిషీటులో స్పష్టంగా అంగీకరించింది. వీరి సంభాషణలను పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించినట్లు ఈడీ చార్జిషీటులో చెప్పింది. అయిత ఇక్కడ విచిత్రమేమిటంటే ఈ మొత్తం కేసులో చంద్రబాబు పాత్రను ఈడీ చార్జిషీటులో ఎక్కడా ప్రస్తావించకపోవటం. అసలు ఈ కేసుకు మూలమే చంద్రబాబిచ్చిన హామీ. అలాంటిది సూత్రదారిని వదిలిపెట్టి పాత్రదారులను మాత్రమే చార్జిషీటులో ప్రస్తావించటమంటే ఆశ్చర్యంగా ఉంది.