Begin typing your search above and press return to search.

వాతావరణం లో కీలక మార్పులు... ఐపీసీసీ రిపోర్టులో ఏముందంటే ?

By:  Tupaki Desk   |   10 Aug 2021 5:32 AM GMT
వాతావరణం లో కీలక మార్పులు... ఐపీసీసీ రిపోర్టులో ఏముందంటే ?
X
రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల భవిష్యత్తులో మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐపీసీసీ నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. మనుషులు చేపడుతున్న చర్యలే వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్నది వాస్తవం అని ఐక్యరాజ్యసమితి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ - ఐపీసీసీ తన నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పులపై వచ్చిన అతిపెద్ద సమగ్ర నివేదిక ఇదేనని భావిస్తున్నారు.ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్‌కు కారణం అవుతున్న ఉద్గారాలు ఇలాగే కొనసాగితే దాదాపు పదేళ్లలోనే భూమి ఉష్ణోగ్రత మరింతగా పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది.

అలాగే, ఈ శతాబ్దం చివరినాటికి సముద్ర మట్టంలో పెరుగుదల 2 మీటర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. అయితే గ్రీన్‌ హౌస్ ఉద్గారాలలో కనిపిస్తున్న తరుగుదల ఉష్ణోగ్రతలను స్థిరీకరించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, 'వాతావరణ మార్పులు' అంశంలో వెలువడిన వివిధ అధ్యయనాలను పరిశీలించి ఆ సారాంశాన్ని 42పేజీల అధ్యయన పత్రంగా తీసుకువచ్చింది.ఐపీసీసీ అనేది వాతావరణ మార్పులపై వచ్చిన శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సంస్థ. దీన్ని 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం, వరల్డ్ మెటీరలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా స్థాపించాయి.

వాతావరణ మార్పుల విషయంపై సత్వర చర్యలు చేపట్టేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1850-1900 మధ్య కాలంలో కన్నా 2011-2020 మధ్య కాలంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.09C ఎక్కువగా ఉంది.1850వ సంవత్సరం నుంచి పరిశీలిస్తే గత ఐదేళ్లల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.1901-1971 మధ్య కాలంతో పోల్చితే, ఇటీవల సముద్ర మట్టం పెరుగుదల రేటు దాదాపు మూడు రెట్లు పెరిగింది.1990ల నుంచి హిమనీనదాలు కరిగిపోవడానికి, ఆర్కిటిక్‌లో మంచు కరిగిపోవడానికి 90% కారణం మానవ తప్పిదాలే.

1950ల నుంచి చూస్తే, ఇటీవల కాలంలో తీవ్రమైన వేడిగాలులు తరచూ వీస్తున్నాయి. మంచు తుఫానుల తాకిడి తగ్గింది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ఉద్గారాలను నియంత్రించకపోతే, 2040 నాటికి ఉష్ణోగ్రతలు 1850-1900 స్థాయిల కన్నా 1.5C పెరుగుతాయి.2050 లోపల ఒక్కసారైనా ఆర్కిటిక్‌ లో సెప్టెంబర్ మాసంలో మొత్తం మంచు కరిగిపోయే పరిస్థితి వస్తుంది. సముద్ర మట్టం పెరుగుదల/తరుగుదల వలన కలిగే ఉపద్రవాలు గతంలో శతాబ్దానికి ఒకసారి సంభవించేవి.కానీ 2100 నాటికి, సగానికి పైగా టైడల్ గేజ్ ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక్కసారైన ఈ ఉపద్రవాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు పెరిగే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.