Begin typing your search above and press return to search.

పీవీపీ ఓ బ్లాక్‌ మెయిల‌ర్‌: కేశినేని నాని

By:  Tupaki Desk   |   25 March 2019 8:55 AM GMT
పీవీపీ ఓ బ్లాక్‌ మెయిల‌ర్‌: కేశినేని నాని
X
స‌రిగ్గా మూడు నాలుగేళ్ల కింద‌ట పీవీపీ - శ్రుతిహాస‌న్ మ‌ధ్య వివాదం గురించి తెలిసిందే. అప్ప‌ట్లోనే ఊపిరి (25 మార్చి 2016 రిలీజ్) సినిమాకి క‌థానాయిక‌గా శ్రుతిహాస‌న్ ని ఎంపిక చేసుకున్నారు. తొలుత అడ్వాన్స్ అందుకుని సినిమా ప్రారంభోత్స‌వానికి ముందు శ్రుతిహాస‌న్ ఆ ప్రాజెక్టు నుంచి అనూహ్యంగా త‌ప్పుకుంది. అప్ప‌ట్లోనే సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `సంఘ‌మిత్ర‌` చిత్రానికి శ్రుతిహాస‌న్ కాల్షీట్లు కేటాయించింది. దాంతో భారీ ప్రాజెక్టు కోసం శ్రుతి నాగార్జున - పీవీపీ- వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని కాద‌నుకుంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే తాజాగా పీవీపీపై కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు ప‌లు సందేహాల్ని రేకెత్తించాయి. పాత గాయాల్ని కొత్త‌గా త‌వ్వి తీశాయి.

విజ‌య‌వాడ టీడీపీ త‌రుపున‌ ఎంపీగా పోటీ చేస్తున్నకేశినేని నాని వైసీపీ విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థి పీవీపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న ప్ర‌త్య‌ర్థి పీవీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ గారి అమ్మాయి శృతిహాస‌న్ ని బ్లాక్ మెయిల్ చేసి డేట్స్ తీసుకున్న పీవీపీ ఆమెను ఏడిపించార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. శృతిహాస‌న్ త‌ర‌హాలోనే మ‌రింత మందిని పీవీపీ బ్లాక్‌ మెయిల్ చేశార‌ని ఆరోపించారు.

ఇండ‌స్ట్రీలో మ‌హేష్‌ బాబును త‌ప్ప ప్ర‌తి హీరోను మోసం చేసిన ఘ‌న‌త పీవీపీదేన‌ని ఈ సంద‌ర్భంగా నిప్పులు చెరిగారు. అత‌ని బ్లాక్ మెయిల్ రాజ‌కీయానికి ఒక్క మ‌హేష్‌బాబు మాత్రం లొంగ‌లేద‌ని, ఇండ‌స్ట్రీలో ఎవ‌రి డేట్స్ కావాల‌న్నా వారికి లీగ‌ల్ నోటీసులు జారీచేసి బ్లాక్ మెయిల్ చేసిన చ‌రిత్ర పీవీపీకి ఉంద‌ని సెటైర్లు వేశారు. చిన్న‌త‌నం నుంచే పీవీపీది నేర ప్ర‌వృత్తి అని, అత‌నో నేర‌గాడ‌ని, అంత‌ర్జాతీయ నేర‌గాళ్ల‌కు విజ‌య‌వాడ‌లో స్థానం లేద‌ని మండిప‌డ్డారు. కెన‌రా బ్యాంక్‌ కు పీవీపీ 137 కోట్లు ఎగ‌వేశార‌ని, దానికి సంబంధించి ఇటీవ‌లే కెన‌రా బ్యాంక్ అత‌నికి నోటీసులిచ్చింద‌ని వెల్ల‌డించ‌డం విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లంగా మారింది.