Begin typing your search above and press return to search.

పాడు మాట‌లు మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   27 Aug 2018 10:34 AM GMT
పాడు మాట‌లు మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే!
X
ప్ర‌కృతి విప‌త్తును విప‌త్తులా కాకుండా రాజ‌కీయ వేదిక‌లుగా మార్చుకోవ‌టం బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ అవుతోంది. లేని పోని అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చి.. గంద‌ర‌గోళానికి గురి చేయ‌టం.. భావోద్వేగాల్ని రెచ్చ‌గొట్ట‌టం చేస్తున్న వైఖ‌రి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతోంది. మొన్న‌టికి మొన్న కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు కార‌ణంగా.. అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం మీద కేర‌ళ వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే అంటూ చిత్ర‌మైన వాద‌న‌ను తీసుకురావ‌టం.. దీనిపై ప‌లువురు మండిప‌డ‌టం తెలిసిందే.

తాజాగా ఆ త‌ర‌హాలోనే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు. హిందువుల మ‌నోభావాల్ని గాయ‌ప‌రుస్తున్నందుకే కేర‌ళ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌ర్ణాట‌క లోని విజ‌య‌పుర ఎమ్మెల్యే బ‌సంగౌడ్ పాటిల్ త‌న వ్యాఖ్య‌ల‌తో వివాదాస్ప‌దంగా మారారు.

గోవుల్ని వ‌ధించ‌టం హిందువుల మ‌నోభావాల‌కు విరుద్ధ‌మ‌ని.. ఇత‌ర మ‌త‌స్తుల మ‌నోభావాల‌ను ఎవ‌రూగాయ‌ప‌ర్చ‌కూడ‌ద‌న్నారు. కేర‌ళ‌లో ఇప్పుడేం జ‌రిగిందో చూడండి.. బ‌హిరంగంగానే గోవ‌ధ‌కు పాల్ప‌డుతున్నందునే సంవ‌త్స‌రంలోగా వారికి ఆ గ‌తి ప‌ట్టిందంటూ నోరు జారారు. హిందువుల మ‌నోభావాల్ని గాయ‌ప‌ర్చిన వారంద‌రికి ఇదే గ‌తి ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. మ‌తాల‌కు.. కులాల‌కు అతీతంగా కేర‌ళ‌కు సాయం అందుతున్న వేళ‌.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఏ మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని చెబుతున్నారు. ఏదో ర‌కంగా మాట్లాడి రాజ‌కీయ ల‌బ్థి పొందాల‌నుకునే వారి నుంచి ఇంత‌కు మించి ఎక్కువ ఆశించ‌లేం క‌దా?