Begin typing your search above and press return to search.

చిన్నారి ప్రాణం తీసిన గేమ్‌..మోడీకి సీఎం లేఖ‌

By:  Tupaki Desk   |   14 Aug 2017 4:43 AM GMT
చిన్నారి ప్రాణం తీసిన గేమ్‌..మోడీకి సీఎం లేఖ‌
X
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బ్లూవేల్ ఆన్‌ లైన్ గేమ్ బారిన పడి మరో విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. ముఖానికి పాలిథిన్ కవర్‌ ను బిగించుకుకొని ఊపిరి ఆడకుండా చేసుకొని చనిపోయాడు. పశ్చిమబెంగాల్‌ లోని మిడ్నాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న అంకన్ పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అంకన్ ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి బాత్‌ రూమ్‌ లో చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించిన తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. మెడ చుట్టూ పాలిథిన్ కవర్‌ ను గట్టిగా చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిసారిగా అతడు బ్లూవేల్ గేమ్ ఆడుతూ కనిపించినట్లు సమాచారం.

గత నెలలో ముంబయికి చెందిన ఓ విద్యార్థి ఎత్తయిన భవనం మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో బ్లూవేల్‌ ఆట దేశంలో వెలుగులోకొచ్చింది. అతడు బ్లూవేల్‌ ఆటకు బానిసైనట్టు సహచర విద్యార్థులు పేర్కొన్నారు. ఇటీవల వేర్వేరు చోట్ల ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా యూఎస్‌ - చైనా - తదితర దేశాల్లో ఇప్పటికే 130 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. అజ్ఞాత నిర్వాహకుడి సాయంతో ఆడే ఈ ఆట చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నది. 50 రోజుల చాలెంజింగ్‌ గేమ్‌ ఆడేవారికి అజ్ఞాత నిర్వాహకుడు పలురకాల టాస్క్‌ లు ఇస్తూ ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు.

కాగా, ఈ ఆటను ఆన్‌ లైన్‌ లో నిషేధించాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్‌ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. సమాజానికి మొత్తం సవాల్‌ గా మారిన బ్లూవేల్‌ గేమ్‌ పై బాధ్యతాయుత సంస్థలన్నీ సమగ్ర చర్యలు తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని ఆయన అన్నారు. ఇదిలాఉండ‌గా...మనుషులకు ప్రాణ సంకటంగా మారిన ఆ ఆటను ఫిలిప్‌ బుడైకిన్‌ అనే వ్యక్తి 2013లో సృష్టించాడు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. ఆటకు సంబంధించి ఇటీవల అతడిని ఇంటర్వ్యూ చేయగా పలు కీలక విషయాలు వెల్లడించారు. పరిశుభ్ర సమాజ స్థాపన కోసమే బ్లూవేల్‌ ఆటను సృష్టించినట్టు అతడు తెలిపాడు. ఈ గేమ్‌ లో పాల్గొనే వారందరూ జీవసంబంధ వ్యర్థాలని అన్నాడు.