Begin typing your search above and press return to search.

ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ప్రసారం అంత తప్పా?

By:  Tupaki Desk   |   24 April 2021 4:30 AM GMT
ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ప్రసారం అంత తప్పా?
X
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలు ఎన్నుకునే పాలకులు.. తాము పాలించే వారికి వివరాలు తెలిపేందుకు అంత అసౌకర్యానికి గురి కావాల్సిన అవసరం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారికి.. అన్ని విషయాల్ని చెప్పేయటం తప్పేం కాదు. కాకుంటే.. దేశ భద్రత.. అంతర్గత భద్రత లాంటి సున్నిత అంశాల్ని పక్కన పెడితే.. మిగిలిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేముంది?

ఈరోజు యావత్ దేశం కరోనా బారిన పడి విలవిలాడుతోంది. ఇలాంటివేళ.. మహమ్మారి తీవ్రత ఉన్నరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే అందులో తప్పేముంది? ప్రధానితో జరుగుతున్న సమావేశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రత్యక్ష ప్రసారాన్ని చేస్తున్న విషయం తెలుసుకున్న మోడీ అసహనం వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో.. తాను తప్పు చేయలేదన్న విషయాన్ని వివరణ రూపంలో చెబుతూ.. సారీ చెప్పిన ఢిల్లీ సీఎం తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. ‘మన సంప్రదాయానికి.. నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతర్గత సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇది సముచితం కాదు. మనం సంయమనం పాటించాలి’ అని తీవ్రంగా వ్యతిరేకించిన మోడీ మాటల్ని చూసినప్పుడు.. ఎందుకంత అసహనం అన్నది ప్రశ్నగా మారుతోంది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు.. కేంద్రంతో మాట్లాడుతున్న మాటలు ప్రజలు తెలుసుకుంటే.. కొంపలేమీ అంటుకోవు కదా? ప్రధాని ముందుకు ఆయా రాష్ట్రాలు తీసుకెళ్లిన అంశాలు.. దానికి ప్రధాని మోడీ స్పందించిన తీరు ఏమిటన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. అంతకు మించి జరిగే నష్టం ఏమిటన్నది ప్రశ్న. కాకుంటే.. సదరు సమావేశం రాజకీయ అంశంగా మారొచ్చు. అలా అని ప్రైవేటుగా సమావేశం జరిగినంత మాత్రాన పొలిటికల్ కలర్ లేకుండా ఏమీ సాగదు కదా? విపత్తు విరుచుకుపడిన వేళ.. విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకు.. ప్రత్యక్ష ప్రసారమే మంచిది. ప్రజలే ప్రభువులైన రాజ్యంలో..వారి ఆరోగ్యంపై జరిగే చర్చను పాలకులు దాపరికంగా నిర్వహించుకోవటం ఏమిటన్నది అసలు ప్రశ్న.