Begin typing your search above and press return to search.

కేఈ కూడా అదే మాట చెప్పేశారు!

By:  Tupaki Desk   |   26 Dec 2016 11:30 AM GMT
కేఈ కూడా అదే మాట చెప్పేశారు!
X
ఆంధ్ర‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా హర్ట్ అయిపోయారు. ఎందుకు అంటే... మీడియా తన మాటలను వక్రీకరించినందుకు. అది కూడా.... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని తాను చెప్తే దాన్ని వేరే కోణంలో చూపించినందుకు అంట. ఏంటి అంత తేలికగా ఒక ఉప ముఖ్యమంత్రి అనని మాటలను అన్నట్లుగా మీడియా రాసేస్తుందా? అంటే కేఈ అవున‌ని అనేస్తున్నారు మ‌రి!!

అస‌లు విష‌యం ఏమిటంటే... నిన్న కేఈ కృష్ణ‌మూర్తి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ కాలం వేరు ప్ర‌స్తుత సీఎం చంద్రబాబు కాలం వేరు అని చెప్పారు. అంత‌టితో ఆగ‌కుండా..టీడీపీలో నేతలకు ఎన్టీఆర్ టైంలో ఉన్నట్లుగా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండేవాడినని నాలుగేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశానని కేఈ గ‌త స్మృతుల‌ను నెమ‌రు వేసుకున్నారు. ఎన్టీఆర్ ముక్కుసూటి మనిషి అని.. ఇప్పుడున్న బాసు మాత్రం చాలా ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది స‌హ‌జంగానే మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌సారం కావ‌డం, బాబుకు కాలిపోయిన‌ట్లుగా వార్త‌లు వెలువ‌డ‌టంతో కేఈ మాట మార్చారు. తాజాగా కర్నూలులోని మామిదాలపాడులో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సంద‌ర్భంగా మాట్లాడుతూ....ఏపీ చంద్రబాబుపై రెండు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, తనకు ఎవరిపైనా అసంతృప్తి లేదని కేఈ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని ప్ర‌శంసించారు. తాను పదవిలో ఉండగానే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు కేఈ చెప్పారు.

ఇలా ముందుగా మ‌న‌సులో ఉన్న మాట‌లు చెప్తూ నోరు జార‌డం త‌ర్వాత మీడియా వ‌క్రీక‌రించింది అని దాట‌వేసే మాటలు చెప్పే నాయ‌కుల్లో తాజాగా కేఈ కృష్ణ‌మూర్తి కూడా చేరిపోయారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/