Begin typing your search above and press return to search.

కేఈకి జ‌రిగిన తాజా అవ‌మానం ఇద‌ట‌!

By:  Tupaki Desk   |   5 May 2017 8:08 AM GMT
కేఈకి జ‌రిగిన తాజా అవ‌మానం ఇద‌ట‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజా నిర్ణ‌యం వివాదాస్ప‌దం అయింది. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ఉప ముఖ్య‌మంత్రి, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణ‌మూర్తికి మ‌రోమారు ప‌రాభ‌వం త‌ప్ప‌లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న మంత్రివర్గంలో అందరికంటే సీనియర్ అనే గౌర‌వంతోనే ఉప ముఖ్య‌మంత్రి హోదాను కేఈ క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆయ‌న‌కు కీల‌క‌మైన రెవెన్యూశాఖ కూడా ఇచ్చారు. అయితే ఆయ‌న‌కు పేరుకే శాఖ ఇచ్చారు త‌ప్ప అందులో బాధ్య‌త‌ల‌న్నింటినీ ఇత‌రుల‌కు అప్ప‌గిస్తున్నార‌నే విమ‌ర్శ‌కు తాజాగా మ‌రో నిద‌ర్శ‌నం తోడు అయింది. కేఈ అధీనంలోని రెవిన్యూ శాఖ ఆధ్వ‌ర్యంలో భూకేటాయింపుల వ్యవహారం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆయనకు ఆ బాధ్యత అప్పగించలేదు. ఇద్దరు జూనియర్ మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి అందరినీ విస్మయపరిచింది. వివిధ పరిశ్రమలు, కంపెనీలను ఆకర్షించే పనిలో ఉన్న ప్రభుత్వం, అందుకు అవసరమైన భూములు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భూకేటాయింపుల కమిటీలో ఇద్దరు జూనియర్ మంత్రులను నియమించడం విమర్శలకు తావిచ్చింది.

కంపెనీల‌కు చేయాల్సిన భూ కేటాయింపుల విష‌యంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కమిటీలో రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తికి స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశమయింది. నిజానికి భూముల వ్యవహారాలన్నీ ఆయన శాఖ చూడాల్సి ఉండగా, గత మూడేళ్ల నుంచి మున్సిపల్ మంత్రి నారాయణకు అప్పగించారు. రాజధాని భూముల వ్యవహారాలన్నీ నారాయణ నేతృత్వంలోనే జరుగుతున్నాయి. దీనిపై అప్పట్లో అనేక ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. తాజా కమిటీలో యనమల రామకృష్ణుడు, నారాయణతోపాటు కొత్తగా మంత్రివర్గంలో చేరిన లోకేష్, నక్కా ఆనంద్‌ బాబుకు స్థానం కల్పించడం విమర్శలకు కారణమయింది. ఇద్దరు జూనియర్ మంత్రులకు ఈ వ్యవహారాల్లో ఏ మాత్రం అనుభవం లేదని, సీనియర్ అయిన రెవిన్యూ మంత్రిని వేయకుండా, కావలసిన పనులు చేసుకునేందుకే జూనియర్లతో కమిటీని భర్తీ చేశారని విప‌క్షాలు త‌ప్పుప‌డుతున్నాయి.

విశాఖ భూముల వ్యవహారంలో ప్రత్యక్షపాత్ర పోషిస్తున్న లోకేష్‌ కు, అదే కమిటీలో స్థానం కల్పించడం ఎందుకో ప్రజలకు సులభంగానే అర్థమవుతోందని విప‌క్షాలు పేర్కొంటున్నాయి. భూకేటాయింపుల కమిటీవంటి కీలకమైన కమిటీలో స్థానం దక్కించుకున్న లోకేష్.. ప్రభుత్వంలో తన స్థానమేమిటో చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఇకపై ప్రభుత్వం వేసే అన్ని సబ్ కమిటీల్లోనూ లోకేష్ ఉండబోతారన్న సంకేతాలకు ఇది నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ కు ముందు అదే శాఖ నిర్వహించిన అయ్యన్నపాత్రుడికి అప్పుడు ఈ కమిటీలో చోటు లభించకపోవడం ప్రస్తావనార్హం. కాగా, రాజ‌కీయాల్లో ముఖ్యమంత్రికి సమకాలికుడు అయిన కేఈకి ఇది ఊహించ‌ని ప‌రాభ‌వమ‌ని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/