Begin typing your search above and press return to search.

మూడు నెల‌ల్లో ప్రత్యేక హోదా

By:  Tupaki Desk   |   27 Oct 2015 6:50 AM GMT
మూడు నెల‌ల్లో ప్రత్యేక హోదా
X
అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా సంగ‌తి అటుంచి..ప్ర‌త్యేక ప్యాకేజీ ఊసు కూడా ఎత్తలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం అస్ప‌ష్ట‌త కొన‌సాగిస్తున్న నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం మూడునెల‌ల్లో ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం పోటీ ప‌డుతున్న రాష్ర్టాల లెక్క‌ల‌న్నీ తీస్తూ ఏపీకి ఆ చాన్స్ త‌ప్ప‌నిస‌రి ద‌క్కుతుంద‌ని చెప్పారు.

దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాయని చెప్పిన కేఈ వాటికి ప్రత్యేక హోదా ఇవ్వాలా.. లేదా? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ కమిటీని నియమించారన్నారు. ఈ కమిటీ నివేదిక మూడు నెలల్లో వ‌స్తుంద‌ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ స్పెష‌ల్ స్టేట‌స్‌ కు సానుకూలంగా నివేదిక‌ రానుందన్నారు. ఆంధ్ర‌ప‌ద్రేశ్‌ రాష్ట్రం మినహా హోదా కోరే మిగిలిన నాలుగు రాష్ట్రాలకు రాజధాని, భవనాలు ఉన్నాయని, రాష్ట్రానికి మాత్రం రాజధాని, భవనాలు ఏమీ లేకపోగా లోటు బడ్జెట్‌ తో కునారిల్లుతున్నామన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష కాంగ్రెస్ - వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని కేఈ కొట్టిపారేశారు. నాడు పార్లమెంట్‌ లో ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నోరు విప్పకుండా రాష్ట్ర విభజనకు సహకరించారన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటూ ధర్నాలు, ఆందోళనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. జగన్ ప్రతిపక్ష నేత కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని కేఈ దుమ్మెత్తిపోశారు. రాజధాని విషయంలో జగన్‌ కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. ఏ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఇప్పటికీ ఆయన చెప్పకపోగా అమరావతిని విమర్శించడం గర్హనీయమన్నారు.