Begin typing your search above and press return to search.

నాయకులు.. వియ్యంకులు

By:  Tupaki Desk   |   28 Oct 2015 6:47 AM GMT
నాయకులు.. వియ్యంకులు
X
తెలుగుదేశం పార్టీలో బంధుత్వాలు బలపడుతున్నాయి. నేతల మధ్య చుట్టరికాలు కలుస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు పి.నారాయణ - గంటా శ్రీనివాసరావులు చుట్టరికం కలుపుకొన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ వియ్యంకులవుతున్నారు. మంత్రి గంటా కుమారునడితో మరో మంత్రి నారాయణ కూతురు వివాహం ఖరారైపోయింది. ఇటీవలే వీరి వివాహానికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. తాజాగా టీడీపీలో మరో ఇద్దరు వియ్యంకులవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి - కొనకళ్ల నారాయణ వియ్యంకులుగా మారుతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మంచి స్థానంలో ఉన్న కేఈ కృష్ణమూర్తి - మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణల మధ్య బంధుత్వం కలుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గానికి కేఈ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణ తెలుగుదేశం పార్టీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరిదీ గౌడ సామాజిక వర్గం. వీరిద్దరి మధ్య ఇప్పటి్కే మంచి స్నేహం ఉంది. గతేడాది వరకు ఏపీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేఈ కృష్ణమూర్తి పనిచేశారు. ఇటీవలే ఆ పదవికి కొనకళ్ల నారాయణ ఎన్నికయ్యారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన తమ్ముడు జయచంద్రుడి కుమార్తె మహితను, కొనకళ్ల నారాయణ రెండో కుమారుడు చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. నవంబరు 2వ తేదీన నిశ్చితార్థం, డిసెంబర్‌లో పెళ్లి జరపాలని రెండు కుటుంబాలూ నిర్ణయించుకున్నాయి. మరోవైపు ఇద్దరు నేతలూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం చెప్పగా ఆయన దీన్ని శుభపరిణామంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా ఇంతకుముందూ టీడీపీ నేతల మధ్య బంధుత్వాలు కలిశాయి. ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న గరికపాటి మోహనరావులు కూడా వియ్యంకులే.