Begin typing your search above and press return to search.

అమరావ‌తిలో జ‌గ‌న్‌ కు ప్ర‌భుత్వ నివాసం

By:  Tupaki Desk   |   1 July 2016 7:34 AM GMT
అమరావ‌తిలో జ‌గ‌న్‌ కు ప్ర‌భుత్వ నివాసం
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి భారీ సెటైర్ వేశారు. జగన్‌ కు చెందిన పలు ఆస్తులు - ఆయ‌న నివాసాన్ని ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన నేపథ్యంలో అమరావతికి వస్తే మంచి ఇల్లు నిర్మించి ఇస్తామని ఎద్దేవా చేశారు. జగన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాబట్టి ఈ ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గతంలో రూ.500 కోట్లు - నేడు రూ.700 కోట్లు ఈడీ అటాచ్‌ చేసుకుందని కృష్ణ‌మూర్తి పేర్కొంటూ రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లు అటాచ్‌ చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అందుకే జ‌గ‌న్‌ కు ఇళ్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్నామ‌ని రాజధానిలో ఉండి ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండవచ్చని పత్రికా ముఖంగా ఆహ్వానం పలుకుతున్నామని కేఈ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తెచ్చి ప్రక్షాళన చేశామన్నారు. రెవెన్యూ - రిజిస్ట్రేషన్‌ - సర్వే శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరింత పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఏపీ మంత్రి దేవినేని ఉమ జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కొట్టేసిన డబ్బులనే ఇప్పుడు ఈడీ జప్తు చేసిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జగన్ ఇప్పడు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా తన అవినీతిని అంగీకరించాలని దేవినేని ఉమ సూచించారు.