Begin typing your search above and press return to search.

కాంగ్రెస్-టీడీపీని ఒక్క‌టి చేస్తున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   24 Feb 2019 9:41 PM IST
కాంగ్రెస్-టీడీపీని ఒక్క‌టి చేస్తున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వేసిన స్కెచ్ మ‌రోమారు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక గురించి కేసీఆర్ ఎత్తుగ‌డ - అనంత‌రం పార్టీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దించ‌డం అనే ప్ర‌క్రియ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఐదుగురు ఎమ్మెల్సీ సీట్ల ఈ ఎన్నిక కోసం న‌లుగురు అభ్య‌ర్థులను కేసీఆర్ ప్ర‌క‌టించారు. మ‌రో సీటును ఎంఐఎంకు ప్ర‌క‌టించారు. అయితే, కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ అల‌ర్ట్ అయింది. మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీఈతో క‌లిసి బ‌రిలో దిగాల‌ని చూస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) నిర్ణయించింది. టీడీపీ సహకరిస్తే ఎమ్మెల్సీ స్థానాన్ని సునాయసంగా (ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్‌లోనే) గెలుపొందవచ్చని కాంగ్రెస్ అంచనా. సీఎల్‌ పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అంశంపై వారు చర్చించారు. ఎమ్మెల్సీ స్థానాన్ని మొదటి రౌండ్‌ లోనే కైవసం చేసుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. అయితే కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నందున వారిరువురూ సహకరిస్తే గెలుపొందేందుకు అవకాశం ఉంది. ఈ విషయమై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణతో చర్చించాలని వారు భావించారు. అయితే, ఇప్ప‌టికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎత్తుగ‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలాఉండగా, ఆ ఒక్క సీటు కోసం కాంగ్రెస్‌ లో ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ లభించని వారికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం మర్రి శశిధర్‌ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మర్రికి టిక్కెట్ రాని సంగతి తెలిసిందే. ఇంకా నాయిని రాజేందర్ రెడ్డి - హర్కర వేణుగోపాల్ - మహిళా కోటా నుంచి నేరెళ్ళ శారద టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇంకా కుసుమ కుమార్ - డికె అరుణ - డాక్టర్ జే. గీతారెడ్డి కూడా ఆశిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సీటుపై స్ప‌ష్ట‌త రానుంది.