Begin typing your search above and press return to search.

కేసీఆర్ సార్‌.. ధ‌నిక రాష్ట్రంలో ప‌దో తేదీ వ‌ర‌కూ జీతాలు రావా?

By:  Tupaki Desk   |   12 April 2022 12:30 AM GMT
కేసీఆర్ సార్‌.. ధ‌నిక రాష్ట్రంలో ప‌దో తేదీ వ‌ర‌కూ జీతాలు రావా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న పాల‌న‌లో రాష్ట్రం బంగారు తెలంగాణ‌గా మారింద‌నే విష‌యాన్ని చెప్పుకొనే సంగ‌తి తెలిసిందే. రాష్ట్రం బంగారు తెలంగాణ‌గా మార్చిన‌ట్లు పేర్కొంటూ బంగారు భార‌త‌దేశం వైపు ముందుకు సాగుతున్న‌ట్లు చెప్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి ఇలాకాలో షాకింగ్ ప‌రిణామం వెలుగులోకి వ‌చ్చింది.

పదో తేదీ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంకా జీతాలి ఇవ్వ‌లేదు. ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకున్న తర్వాతే సాలరీలు వస్తాయని ఆర్థికశాఖ అధికారులు అన‌ధికారంగా పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో పదో తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు శాలరీలు అందలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శనివారం వరకు 14 జిల్లాల్లోని ఉద్యోగులు, టీచర్లకు మాత్రమే జీతాలు జమ చేసినట్లు తెలిసింది. మరో 19 జిల్లాల్లో ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆదివారం సెలవు కావడంతో కనీసం సోమవారమైనా జీతాలు వేస్తారని ఉద్యోగులు ఆశ పడుతున్నారు.

ఐతే జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఇంకో 3,4 రోజులు పడుతుందని ఫైనాన్స్, ట్రెజరీ శాఖల అధికారులు చెప్తున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల రోజులకే.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే శాలరీలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఉండటంతో రానున్న రోజుల్లో... పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

మ‌రోవైపు జీతాలు ఆలస్యం కావడంతో టైమ్ కు EMI లు కట్టలేకపోతున్నమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 90 శాతం ప్రభుత్వ ఉద్యోగులు హోం లోన్లు తీసుకున్నామని... పర్సనల్ లోన్లు తీసుకొని పిల్లలని చదివిస్తున్నామని, ఈఎంఐలు టైంకు కట్టలేకపోతున్నామని వర్రీ అవుతున్నారు.

లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పదో తారీఖు లోపు వాయిదాలు చెల్లించకపోతే తమ ఖాతాలను స్తంభింపజేసి పెనాల్టీలు విధిస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.