Begin typing your search above and press return to search.

నీతి ఆయోగ్ భేటీ బ‌హిష్క‌ర‌ణ‌.. మేం పోం!: కేసీఆర్ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   6 Aug 2022 5:36 PM GMT
నీతి ఆయోగ్ భేటీ బ‌హిష్క‌ర‌ణ‌.. మేం పోం!:  కేసీఆర్ వ్యాఖ్య‌లు
X
రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అందుకు నిరసనగా.. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా బాధాకరమే అయినప్పటికీ.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు వివరించారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతిఆయోగ్‌ తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్ వివరించారు. నీతి ఆయోగ్‌ను టీమ్‌ ఇండియా అని పిలుస్తామని ప్రధాని చెప్పినట్టు గుర్తుచేశారు. నీతిఆయోగ్‌తో దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించామన్నారు.

కానీ.. నీతిఆయోగ్‌ ఇప్పుడు నిష్క్రియకపరత్వంగా, నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశచరిత్రలో ఎప్పుడూలేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారని.. అందులో దాదాపు 800 మంది రైతులు చనిపోయారని బాధపడ్డారు.

రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సాగుకు నీరు, విద్యుత్తు దొరకట్లేదన్న కేసీఆర్.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందన్నారు. నిత్యావసరాల ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ కూలీలు దేశ రాజధానిలో ధర్నా చేస్తే దుస్థితి వచ్చిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతోందని.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందన్నారు.

దేశం ప‌రువు పోతోంది..

``నీతిఆయోగ్‌ వల్ల దేశానికి ఏం ఉపయోగం జరిగింది..? నీతిఆయోగ్‌ సిఫారసులకు కూడా కేంద్రం గౌరవం ఇవ్వట్లేదు. నీతి ఆయోగ్‌కు ప్రధాని వద్ద గౌరవం సున్నా. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు బాగున్నాయని నీతి ఆయోగ్‌ చెప్పింది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. నీతిఆయోగ్‌ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని చెప్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు.

సహకార సమాఖ్య విధానం పోయి ఆదేశిత సమాఖ్య విధానం వచ్చింది. మేము చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం అనే పరిస్థితికి వచ్చారు. కేంద్రం విధానాల వల్ల అంతర్జాతీయంగా మన దేశ పరువుపోతోంది. నీతిఆయోగ్‌ రూపకల్పనలో ఎవ్వరి ప్రమేయం ఉండదు`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.