Begin typing your search above and press return to search.

కేసీఆర్ మార్క్ః ఓ మంత్రి ఔట్‌..మ‌రొక‌రు ఇన్‌

By:  Tupaki Desk   |   2 Aug 2016 9:28 AM GMT
కేసీఆర్ మార్క్ః ఓ మంత్రి ఔట్‌..మ‌రొక‌రు ఇన్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఎంసెట్-2 లీకేజీ అంశం తెలంగాణ ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విద్యార్థుల బంగారు భవిష్యత్‌ కు సంబంధించిన అంశం కావడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ - విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ కు సంబంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో - అటు విపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఎంసెట్ లీకేజీ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రధాన హస్తంగా తీసుకొని ప్రభుత్వంపై దాడులు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రుల‌పై వేటుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఎంతో పకడ్బందీగా ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉన్నా అందుకు మంత్రులు - అధికారులు పట్టించుకోకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌ గా తీసుకున్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై డీజీపీ - సీబీసీఐడి అధికారుల నివేదిక‌ల‌ను సీరియస్‌ గా తీసుకున్న కేసీఆర్ ఎంసెట్ లీకేజీ మచ్చనుంచి బయట పడేందుకు తనదైన శైలిలో కీలక చర్యలకు ఉపక్రమించబోతున్నారని అంటున్నారు. ఎంసెట్-3ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఓ పక్క చర్యలు తీసుకుంటున్నారు. లీకేజీకి సంబంధించి వైద్య - ఆరోగ్యశాఖ మంత్రి చెర్లకోల లక్ష్మారెడ్డిని - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని భర్తరప్ చేయాలంటూ కాంగ్రెస్ - టీడీపీతోపాటు సీసీఐ - సీపీఎం సహా అన్ని పక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల నోరు మూయించేందుకు వైద్య - ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలుకనున్నారా?అంటే అధికారపార్టీ నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. గత ఏడాది కాలంగా మంత్రి లక్ష్మారెడ్డి వ్య‌వహారంపై ముఖ్యమంత్రి నివేదికలు సేకరించారని స‌మాచారం.

ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై లక్ష్మారెడ్డికి ఉద్వాసన తప్పదన్న ప్రచారం ప్రభుత్వంలో జోరుగా కొనసాగుతోంది. అలాగే విద్యాశాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాఖను సైతం మారుస్తారన్న ప్రచారం టీఆర్ ఎస్ పార్టీలో జోరుగా సాగుతున్నది. దీనితో పాటు మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ ఉన్నతి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తన స్వంత పనుల కోసం, అలాగే బంధువులు రెచ్చిపోయి వివాధాలున్న భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ పార్టీకి చెడుపేరు తీసుకవస్తున్నారని మహబూబ్‌ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ నాయకులు ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సమయం కోసం వేచిచూస్తున్న ముఖ్యమంత్రి ఇదే అదునుగా భావించి లక్ష్మారెడ్డిని మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. లక్ష్మారెడ్డి స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మినబంటు అయిన తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ విస్తరణ చేస్తారన్న ప్రచారం వచ్చినప్పుడల్లా నిరంజన్‌ రెడ్డికి మంచి శాఖ అప్పగిస్తారన్న ప్రచారం సైతం జోరుగా సాగిన విషయం తెలిసిందే!. మంత్రివర్గం నుంచి లక్ష్మారెడ్డికి ఉద్వాసన పలికి ఆయన స్థానంలో రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్న...ఆయన నమ్మిన బంటు అయిన నిరంజన్‌ రెడ్డికి మంత్రివర్గంలో కీలకబాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది.

విద్యాశాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాఖ మార్పు చేసి ఆయనకు ఎస్సీ సంక్షేమశాఖ అప్పగించనున్నట్లు పార్టీలో ప్రచారం కొనసాగుతున్నది. ఓ దశలో కడియం శ్రీహరిని సైతం కేబినెట్ నుంచి తొలగిస్తారన్న వార్తలు వచ్చినా, ఆయన సామాజిక వర్గానికి చెందినవారు పార్టీలో లేక పోవడంతో ఆయన శాఖను మార్పు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరితో పాటు మరో ఒకరిద్దరి శాఖలు కూడా మార్పు చేసే అవకాశం లేకపోలేదని పార్టీకి చెందిన సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.