Begin typing your search above and press return to search.

తెలంగాణలో 'ముందస్తు ఎన్నికలకు' కేసీఆర్ యోచన?

By:  Tupaki Desk   |   9 Sep 2022 12:05 PM GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ యోచన?
X
కేసీఆర్ 'జాతీయ' అడుగులు చూస్తుంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని అటు గులాబీ దండు.. ఇటు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా తట్టాబుట్టా సర్దుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలకు వెళ్లాలంటే ముందుగా తెలంగాణలో అధికారంలో ఉండాలి. అందుకే కేసీఆర్ 2024 ఎన్నికల్లో తాను ఫ్రీగా ఉండాలంటే తెలంగాణలో మొదట అధికారంలో ఉండాలని యోచిస్తున్నారు. అందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని సమాచారం.

ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీకి మొత్తం క్యాండిడేట్లు లేరన్నది వాస్తవం. చాలా చోట్ల గట్టి అభ్యర్థులు బీజేపీకి లేరు. ఈ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న కేసీఆర్.. బీజేపీ బలపడకుముందే.. సర్దుకోకముందే దెబ్బతీయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడు అంతర్గత కలహాలతోనే ఉండడంతో ఇదే అదును అని భావిస్తున్నట్టు సమాచారం.

ఒంటరిగా వెళితే తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ నిలుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. సీట్లు తక్కువైనా ఎంఐఎం ఉండనే ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ ను దబ్బకొట్టాలంటే ఇదే అదును అని భావిస్తున్నట్టు సమాచారం. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిపేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్ మూడో సారి వ్యతిరేకత బాగా ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి మొదటి ఐదేళ్లు ఏ ఎన్నిక జరిగినా ఆ పార్టీదే హవా సాగుతూ వస్తోంది. అయితే రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులపై అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గాన్ని అతి కష్టం మీద కైవసం చేసుకుంది. కానీ ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమాత్రం అంచనాలు లేకున్నా టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చింది. అయితే ఒక్క నియోజకవర్గం గెలుచుకోగానే బీజేపీకి బలం పెరిగిపోదని టీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ లాగేసుకోవడంతో టీఆర్ఎస్ లో ఆందోళన పెరిగింది.

ఇదే సమయంలో గులాబీ పార్టీలో ఎంతోకాలంగా ఉన్నా పదవులు దక్కని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇతర పార్టీల వైపు చూశారు. కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునేలా లేదు. అందుకే వీరికి బీజేపీ ప్రత్యామ్నాయంలా కనిపించింది. పైగా కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల్లో స్థానిక నాయకులు అవినీతి పెరిగిపోయింది. దీంతో ప్రజల్లో ఆ నాయకులతో పాటు పార్టీపై కూడా అసంతృప్తి పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు.

తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ఇదే ధోరణితో బీజేపీలోకి చేరబోతున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే బాటలో ఉన్నారు. నిన్నటి వరకు ఎలాంటి చడీ చప్పడు లేని దాసోజు శ్రవణ్ ఏకంగా బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ పయనమయ్యారు. దీంతో అనుకోకుండా బీజేపీకి బలం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజల్లోనూ ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందన్న భావనలో పడుతున్నారు. ఇదే ఊపులో మునుగోడు ఉప ఎన్నిక జరిగితే తమదే విజయమని బీజేపీ ఇప్పటికే ప్రచారం చేసుకుంటోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహించడం లాభమా..? నష్టమా..? అని ఆలోచనలో పడింది.

సాధారణంగా ఉప ఎన్నిక అనగానే కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి కార్యాచరణను మొదలుపెట్టేవారు. ఆ నియోజకవర్గానికి నిధులు భారీగా కేటాయించేవారు. హుజూరాబాద్ విషయంలో అదే చేశారు. కానీ మునుగోడు విషయానికొచ్చేసరికి ఎలాంటి ఉత్సాహం చూపించడం లేదు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తే అనుకోని పరిస్థితుల్లో సీటు జారితే వచ్చే ఎన్నికల్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మునుగోడులో ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఆదరించేవారు తక్కువవుతారు.

అయితే ఇప్పటికిప్పుడు ఉన్న పథకాలకు భారీగా నిధులు కేటాయించి.. అవసరమైతే కొత్త పథకాలు ప్రకటించి నేరుగా ముందస్తు ఎన్నికల్లోకి వెళ్లడం బెటరని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను యాక్సెప్ట్ చేయించకుండా వెయిట్ చేయిస్తున్నాని అంటున్నారు. అయితే బీజేపీ కూడా ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని ప్రకటించింది. కానీ టీఆర్ఎస్ కున్న క్యాడర్ బీజేపీకి గ్రామాల్లో కాస్త తక్కువగానే ఉంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందస్తుకు వెళితే ఏమవుతుంది..? అని టీఆర్ఎస్ ఆలోచిస్తుంది. మరి కేసీఆర్ మొత్తంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.