Begin typing your search above and press return to search.

ఢిల్లీలో భిన్నంగా వ్యవహరించిన గులాబీ బాస్.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 4:32 AM GMT
ఢిల్లీలో భిన్నంగా వ్యవహరించిన గులాబీ బాస్.. ఎందుకిలా?
X
ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాను మాత్రం ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి పెద్దగా ఇష్టపడని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ప్రాణాంతాక కరోనా విషయంలో జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటారో తెలీదు కానీ.. ఆయన ముఖానికి మాత్రం మాస్కు పెట్టుకోవటం అస్సలు కనిపించదు. ఎప్పుడో అరాకొర అన్నట్లుగా ఆయన మాస్కు పెట్టుకోవటం కనిపిస్తుంది. అలాంటి కేసీఆర్.. తాజాగా తన ఢిల్లీ టూర్ సందర్భంగా మాత్రం రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తమ బిగ్ బాస్ కు గ్రాండ్ గా వెల్ కం ప్లాన్ చేశారు ఆ పార్టీ ముఖ్యనేతలు. వారిలోఎంపీ నామా నాగేశ్వరరావు.. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాన మాస్కు అన్నది ఉండదు. అందుకు బదులుగా మిగిలిన నేతల తీరు ఉండటం విశేషం.

మామూలుగా అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు ముఖానికి మాస్కు పెట్టుకోరు. తన చుట్టు ఉన్న వారిని మాస్కుపెట్టుకోవాలని చెబుతారు. అలాంటిది ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఆయన ముఖానికి మాస్కు పెట్టుకొని ఉండటం అందరిని ఆకర్షించింది. మొత్తానికి ఢిల్లీలో దిగగానే తన తీరును మార్చుకున్న వైనం చూస్తే.. దేశ రాజధానిలో కేసుల తీవ్రత కూడా ఆయనీ జాగ్రత్తలు తీసుకోవటానికి కారణమని చెబుతున్నారు.

అంతేకాక.. మూడో వేవ్ మీద పెద్ద ఎత్తున అంచనాలు వ్యక్తం కావటం.. ఇప్పటికే కేరళలో భారీ ఎత్తున కేసులు నమోదు కావటం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసులు ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటివేళ.. రాష్ట్రం కాని రాష్ట్రంలో పర్యటిస్తున్న కేసీఆర్.. ముందస్తుజాగ్రత్తతోనే ముఖానికి మాస్కు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. కేసీఆర్ ఒక్కరు మాస్కు పెట్టుకొని.. ఆయన చుట్టూ ఉన్న వారు మాస్కు పెట్టుకోకపోవటం ఆయనకు రిస్క్ ఉంటుందన్న విషయాన్ని గులాబీ నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.