Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఏడాది పాలన: ప్రయోగాల వేళ..

By:  Tupaki Desk   |   14 Dec 2019 1:32 AM GMT
కేసీఆర్ ఏడాది పాలన: ప్రయోగాల వేళ..
X
కేసీఆర్ నవ్వినా వార్తే.. ఏడ్చినా వార్తే.. మౌనంగా ఉన్నా వార్తే. బోటా బోటీ మెజార్టీ తో తొలి దఫా గద్దెనెక్కిన కేసీఆర్.. ఐదేళ్ల లో చెరగని ముద్రవేసి ముందస్తు ఎన్నికల కు వెళ్లి మరీ ప్రజల ఆదరాభిమానాల తో అఖండ విజయం సాధించారు. తొలిసారికి రెండోసారికి బలమైన నేతగా తెలంగాణలో ఎదిగారు. తొలి ఐదేళ్లలో ఎన్నో లోటుపాట్లను ఎదుర్కొన్నారు. రెండోదఫాలో తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పాలనకు డిసెంబర్ 13తో ఏడాది పూర్తయ్యింది.

తెలంగాణ విడిపోతే చీకట్లు కమ్ముకుంటాయని మాజీ సీఎం కిరణ్ బెదిరించాడు.. నక్సలైట్ల రాజ్యం వస్తుందని బెదిరించారు. నీటి యుద్ధాలన్నారు. గడిచిన ఐదేళ్లు ఎన్నో సమస్యల కు పరిష్కారం చూపించిన కేసీఆర్ రెండో దఫా మాత్రం ప్రయోగాలకే పెద్దపీట వేశారు. తొలి కేబినెట్ లో లేని మహిళలకు చోటు లేదని విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ రెండో దఫాలో ఇద్దరు మహిళలకు చోటిచ్చి విమర్శల కు బదులిచ్చారు. తొలి ఐదేళ్లలో కేసీఆర్ వేరు.. రెండో దఫా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ వేరు. పూర్తి భిన్నమైన కఠినమైన దృక్కోణాన్ని చూపిస్తున్న కేసీఆర్ తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

*నాన్చడం.. విమర్శలు తెచ్చుకోవడం.. పరిష్కరించడం..
కేసీఆర్ రెండో దఫా పాలనలో నాన్చివేత ధోరణి ఎక్కువగా అవలంభిస్తున్నారు. సీఎంగా తనతోపాటు మహమూద్ అలీని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకొని దాదాపు తొమ్మిది నెలలు ఒక్కడే పాలించాడు. హరీష్, కేటీఆర్ లకు మంత్రి పదవులు లేవని.. కేబినెట్ ను విస్తరించవా అని విమర్శలు చెలరేగి ఉధృతమైన వేళ చల్లాగా కేబినెట్ విస్తరించాడు. హరీష్, కేటీఆర్ లు లేని లోటును నేతలు, ప్రజలకు స్వయంగా చూపించాడు. కుటుంబ పాలన అన్న వాళ్లకు వారి లోటుతో బుద్దివచ్చేలా చేశాడన్న అభిప్రాయం గులాబీ పార్టీలో ఉంది. మహిళలకు మంత్రివర్గంలో చోటు లేదని విమర్శించిన వారందరికి ఒక్క మంత్రి వర్గ విస్తరణతో కేసీఆర్ జవాబిచ్చాడు. ప్రజల్లోనే ఆ బాధ తెలిసేలా కేసీఆర్ నాన్చివేత ధోరణిగా వ్యవహరిస్తున్న తీరు రెండో దఫాలో కనిపిస్తోంది.

*సీనియర్ల కు మంగళం.. కొత్త వారికి అవకాశం
మంత్రి వర్గ విస్తరణలో తుమ్మల, కడియం, జోగు రామన్న,మహేందర్ రెడ్డి నాయిని నర్సింహా రెడ్డి లాంటి వాళ్ల కు మంగళం పాడిన కేసీఆర్ కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. పువ్వాడ అజయ్,మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి,మల్లా రెడ్డి లాంటి కొత్త నేతలను మంత్రులను చేసి ఆశ్చర్యపరిచాడు.

*కాంగ్రెస్ ఖతం.. బీజేపీ తో సై
తెలంగాణలో రెండోసారి 88 సీట్లతో అఖండ మెజార్టీ సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడినా కాంగ్రెస్ ను వదల్లేదు కేసీఆర్. 19మంది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12మందిని లాగి ఆ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా గల్లంతు చేశారు. ఇక నాలుగు ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ నేతలతోనూ ఢీ అంటే ఢీ అనేలానే రాజకీయం నడుపుతున్నారు. జడ్పీ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించి ఆ పార్టీ తెలంగాణ లో ఎగెరెగిరి పడకుండా కళ్లెం వేశారు.

*నేలకు దిగి సాము
తొలి ఐదేళ్లలో కాళేశ్వరం సహా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమాలాంటి సంక్షేమ పథకాల జల్లు కురిపించిన కేసీఆర్.. రెండో దఫా మాత్రం వాస్తవ గడ్డు పరిస్థితులకు అనుగుణంగానే పాలిస్తున్నారు. ఆర్థిక మాంద్యం తో రాష్ట్ర ఆదాయం తగ్గడం.. పథకాల్లో కోతలు, కేంద్రం పన్నుల వాట రాక నిధుల లభ్యత లేక పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అనవసర ఖర్చులకు కత్తెర వేస్తూ టైట్ చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పింఛన్లు, రైతు బంధు పెంచారు. మిగతా హామీలను పక్కన పడేశారు.నేల దిగి సాము చేస్తున్నారు.

*కాళేశ్వరం ప్రారంభం.. హుజూర్ నగర్ విజయం
తెలంగాణలో కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత చేసిన పెద్ద పని జూన్ 21న కాళేశ్వరం ప్రారంభోత్సవం. దీంతో తన భగీరథ యత్నం ప్రారంభమైందని ఘనంగా చాటారు. తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చేశారు. చరిత్రలో తనపేరును లిఖించుకున్నాడు. ప్రజలకు ఫలాలు అందించారు. ఇక ఆర్టీసీ సమ్మెతో గడ్డు స్థితిలో ఉండగా దక్కిన హుజూర్ నగర్ గెలుపు కేసీఆర్ ను మరింత బలంగా మార్చింది.

*ఎదురించిన ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు చూడకుండా ముందుకెళ్లడంతో వారిపై ఉక్కుపాదం మోపారు. తన మాట వినకుండా వెళితే ఎంత డేంజరో తెలంగాణ సమాజానికి కేసీఆర్ చవిచూపించారు. చివరకు మంచి ముగింపుతో ఆర్టీసీ సమ్మె చేసిన కార్మికులతో తిట్టిన వాళ్లతోనే జేజేలు పలికించుకున్నారు.

*కేసీఆర్ అమలు చేయని పథకాలు
తెలంగాణ ఎన్నికల్లో హామీనిచ్చిన ప్రధానమైన నిరుద్యోగుల భృతిని కేసీఆర్ అమలు చేయడం లేదు. ఆర్టిక పరిస్థితి దృష్ట్యా ఆ మాటే ఎత్తడం లేదు.

*బీజేపీతో దూరం.. జగన్ తో స్నేహం
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ బీజేపీతో పూర్తి దూరంగా జరిగారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ తో దోస్తీ కట్టి సహృద్భావ వాతావరణాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్పించారు. జగన్ తో కలిసి కేంద్రంలోని బీజేపీతో సమష్టిగా సాగుతున్నారు.

*దిశ ఎన్ కౌంటర్ తో హీరోగా కేసీఆర్ ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంది. దిశ హత్యాచారం జరిగినప్పుడు రాళ్లేసిన వారే కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ దిశ ఎన్ కౌంటర్ విషయంలోనూ కేసీఆర్ వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపింది. కేంద్రంలోని బీజేపీని ఇరుకునపెట్టింది. ఉన్నావ్ రేప్ బాధితురాలు సహా నిర్బయ నిందితులను పోషిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీని డిఫెన్స్ లో పడేసింది.

*రెండోసారి బలంగా.. కఠినంగా.. చేదు మాత్రలా ప్రయోగాల కేసీఆర్
రెండోసారి ప్రజలు పూర్తి మెజార్టీ ఇవ్వడంతో కేసీఆర్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ సమాజం భావోద్వేగాలకు అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తన మాట వినని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆదరించిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా నాన్చివేతతో వ్యవహరించి చివర్లో ట్విస్ట్ తో హీరోగా మిగిలిపోతున్నారు. తెలంగాణలో అధికారంపై ఆశలు పెంచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు కొరకరాని కొయ్యగా మారిపోతున్నారు. రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ లో ఈ స్పష్టమైన మార్పు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.