Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మంత్రి పంపిన ఫైల్ డిటైల్స్ మీకు కావాలా?

By:  Tupaki Desk   |   21 Jun 2016 5:46 AM GMT
కేసీఆర్ కు మంత్రి పంపిన ఫైల్ డిటైల్స్ మీకు కావాలా?
X
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్నితన చెప్పుచేతుల్లోకి తీసుకోవటం.. కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీల మెడలు వంచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తానేంటన్న విషయాన్ని చేతల్లో చూపించారు. తనకు ఎదరులేదన్నట్లుగా ఉన్న ఆయన దెబ్బకు రాజకీయ పార్టీలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. పాలకపక్షానికి అసలుసిసలు ప్రతిపక్షంగా వ్యవహరించే మీడియా సైతం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. ఇలాంటి పరిస్థితులున్న వేళ.. సచివాలయ ఉద్యోగులు.. మంత్రుల పేషీ ఉద్యోగులు మరెంత జాగ్రత్తగా ఉండాలి.

కానీ.. తాజాగా బయటకు వస్తున్న ఉదంతాల్ని చూస్తే.. అలాంటివేమీ కనిపించని పరిస్థితి. మంత్రి పేషీల్లోనూ.. తెలంగాణ సెక్రటేరియట్ లోనూ దందాలు నడిపే వారు ఎక్కువైపోతున్నారన్న విమర్శ ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రతి పనికి ఇంతన్న చందంగా వ్యవహరించటం వారికిప్పుడో అలవాటుగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతున్నా.. సచివాలయ సిబ్బంది.. మంత్రుల పేషీల్లోని ఉద్యోగుల్లో భయం భక్తిపాళ్లు తగినంతగా లేవన్న మాట వినిపిస్తోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా ఒక ఉదంతం బయటకు వచ్చింది.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రెండు రకాల కోర్సులు రద్దు అయ్యాయి. పదో తరగతి కాకుండా ఇంటర్ ను కనీస విద్యార్హతగా పెట్టి నిర్వహణను మరో శాఖకు మార్చాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఈ కోర్సు బోధించే 140 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 70 మందిని వారి సీనియారిటీ ప్రకారం కాకుండా వారు సబ్జెక్టులలో విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా 2013లో వారిని తొలగించారు. ఏడాది తర్వాత మిగిలిన 70 మంది కాంట్రాక్టు ఉద్యోగులనూ తొలగిస్తామని ప్రకటించారు.

ఇంతలో విభజన జరిగిపోయింది. మరి.. ఆ కోర్సులు ఉంచాలా? వద్దా? అన్న అంశంపై టీఆర్ ఎస్ సర్కారు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కోర్సుల్ని కొనసాగించాలంటూ మంత్రుల కమిటీ నిర్ణయించింది. దీంతో.. 70 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. మరి.. ఇలాంటి అవకాశం కలిగినప్పుడు ఎవరికి తగ్గట్లుగా వారు ముడుపుల పర్వానికి తెర తీశారు. పోయిన ఉద్యోగం తిరిగి వస్తుందంటే.. ఎవరు మాత్రం డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. ఎవరికి మాత్రం ఆశ ఉండదు. దీంతో.. ఫైల్ స్పీడ్ గా మూవ్ కావటానికి వీలుగా ఒక ఉద్యోగ సంఘం నేత రూ.3లక్షలు తింటే.. మంత్రుల కమిటీ సిఫార్సును సంబంధిత శాఖా మంత్రికి ఒక లేఖ రాసి.. దాన్ని అధికారిక ఉత్తర్వుగా మార్చాలంటూ లేఖ రాసింది.

దీంతో.. ఉద్యోగాలు తిరిగి వచ్చే వారు సంబంధిత శాఖా మంత్రిని ఆయన సొంత జిల్లాకు వెళ్లి కలుసుకొని.. తమ పని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఆయన అందుకు ఓకే చెప్పారు. కాకుంటే.. మంత్రి గారి నోట ఇలాంటి మాట రావటానికి తానే కారణమని గొప్పలు చెప్పుకున్న ఓ టీఆర్ ఎస్ నేత రూ.లక్ష వసూలు చేశాడు. మంది మీద లక్ష రూపాయిలు అన్నది పెద్ద మొత్తం కాదని.. ఉద్యోగం రావటం ముఖ్యమన్నట్లుగా లక్ష ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఈ ఫైలుకు ఆర్థికశాఖ క్లియరెన్స్ రావటం.. మంత్రిగారు ఈ ఫైల్ ను సీఎంకు రావటం చేశారు. మరి.. ముఖ్యమంత్రిదృష్టికి ఫైల్ వెళ్లటానికి వీలుగా ఏదైనా ఏర్పాటు చేయాలంటూ లబ్థిదారులు కోరుకున్నారు. ఉద్యోగం పోయిమూడేళ్లు అవుతున్న వేళ.. కేసీఆర్ సర్కారు పుణ్యమా అని మళ్లీ ఉద్యోగం వచ్చే క్రమంలో చిల్లర ఖర్చులకు చికాకు పడకూడదంటూ ఎక్కడ.. ఎవరికి.. ఎంతకావాలంటే అంతన్నట్లుగా ఇచ్చుకుంటూ పోయారు. మంత్రిగారి ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లిందా? దానికి సీఎంగా సంతకం పెట్టారా? లేదా? అన్న విషయం తెలుసుకోవటం కోసం వారు బాగానే ఖర్చుచేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి దగ్గరకు ఫైలు వెళ్లటానికి ఒక రేటు.. వెళ్లిన తర్వాత ఫైలు తిరిగి వచ్చిందన్న సమాచారం చెప్పేందుకు మరో రేటుతో ఇష్టారాజ్యంగా నొక్కేస్తున్నారు. సీఎం దగ్గరకు ఫైలు వెళ్లిందన్న విషయాన్ని చెప్పే డాక్యుమెంట్ జిరాక్స్ కోసం ఒక స్కాచ్ బాటిల్.. రూ.25 క్యాష్ ఇవ్వాల్సి వచ్చిందంటే.. ముడుపుల భాగోతం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతుంది. పాపం పుట్ట పగిలినట్లుగా.. ఇష్టారాజ్యంగా.. దారి దోపిడీగా మారిన ముడపులు యవ్వారం తాజాగా సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లుగా తెలిసిందే. దీనిపై ఆయనతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసే ఇలాంటి వారిపై మొహమాటం లేకుండా చర్యలు తీసుకుంటే కానీ.. వ్యవస్థ ఎంతోకొంత సెట్ కాని పరిస్థితి అని చెప్పక తప్పదు.