Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కార్మికులపై అప్పు బాంబు వేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   22 Nov 2019 5:42 AM GMT
ఆర్టీసీ కార్మికులపై అప్పు బాంబు వేసిన కేసీఆర్
X
రాజకీయాల్లో పట్టు చిక్కటమే కష్టం. అలాంటిది దొరక్క దొరక్క అవకాశం దక్కినప్పుడు ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు చెప్పండి? అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటోళ్లు అస్సలు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. తనకు ఇష్టం లేకుండా స్టార్ట్ చేసిన ఆర్టీసీ సమ్మె విషయంలో.. తాను చేసిన వార్నింగ్ లకు వెనక్కి తగ్గి ఉంటే.. అంతో ఇంతో కేసీఆర్ ఈగో సంతోషించేది.

అందుకు భిన్నంగా ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ను లైట్ తీసుకోవటం.. అది కూడా ఒకసారి కాకుండా రెండుసార్లు వరుసగా అలా జరగటంతో ఆయన తీవ్రమైన ఆగ్రహానికి గురైనట్లు చెబుతారు. సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారుతో తేల్చుకుంటామని చెప్పిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల విషయాన్ని లెక్క తేల్చాలన్న పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ కారణంతోనే సమ్మె విషయంలో హైకోర్టు చేసిన సూచనపైనా సానుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా లేని కేసీఆర్.. తాజాగా ఆర్టీసీ కార్మికులు దిగి వచ్చి సమ్మెను ఆపేస్తామన్న మాటను చెప్పిన తర్వాత కూడా ఒక్క అడుగు ముందుకు వేయకుండా ఉన్నారని చెప్పాలి.

ఆర్టీసీ ఇష్యూను తేల్చేయాలని.. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న దీన్ని ప్రైవేటు చేసేయాలన్న పంతంతో ఉన్న ముఖ్యమంత్రి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కారణంతోనే సమ్మెను విరమిస్తామని చెప్పినా.. ప్రభుత్వం మాత్రం అందుకు అనుగుణంగా రియాక్ట్ కాని పరిస్థితి.

తాజాగా నిర్వహించిన రివ్యూలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినిపించిన వాదనను చూస్తే.. సమ్మె చేస్తున్న కార్మికుల విషయంలో తన పట్టును విడిచేది లేదన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పక తప్పదు. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయని.. తక్షణం చెల్లించాల్సిన అప్పులు.. బకాయిలు రూ.2వేల కోట్ల వరకూ ఉన్నాయని చెప్పటంతోపాటు.. ఇలాంటి వేళ సంస్థను నడపటం కష్టమని తేల్చేశారు.

చూస్తుంటే.. అప్పు బాంబును ఆర్టీసీ కార్మికుల నెత్తి మీద వేసి.. తానేమీ చేయలేనని చేతులు ఎత్తేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్న భావన కలిగేలా ఆయన తీరు ఉందంటున్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీ ఇప్పుడు నడవాలంటే రూ.640 కోట్లు కావాలని.. అంత భారాన్ని ఎవరు భరించాలని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. అప్పును భరించే శక్తి ఆర్టీసీకి లేదని.. మాంద్యం కారణంగా ప్రభుత్వం భరించే స్థితిలో లేదని చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీని గట్టెక్కించాలంటే బస్సు ఛార్జీలు పెంచటం.. రూట్లను ప్రైవేటీకరించటంలాంటివి చేయాలన్న ఆలోచనను చెప్పారు. హైకోర్టు తీర్పు చెప్పే వరకూ వెయిట్ చేసి.. దాని తీర్పు ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ మొత్తం సీన్ చూస్తే.. సమ్మె ఎందుకు స్టార్ట్ చేశామురా భగవంతుడా? అన్నట్లు ఉద్యోగులు ఫీలయ్యే వరకూ కేసీఆర్ తీసుకొచ్చేలా ఉన్నారని చెబుతున్నారు. కేసీఆరా మజాకానా?