Begin typing your search above and press return to search.

కేంద్రంపై కేసీఆర్ ఫైర్.. యాసంగిలో ధాన్యం కొనమని తేల్చేశారు

By:  Tupaki Desk   |   30 Nov 2021 7:30 AM GMT
కేంద్రంపై కేసీఆర్ ఫైర్.. యాసంగిలో ధాన్యం కొనమని తేల్చేశారు
X
గడిచిన కొద్ది రోజులుగా కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా సంచలన ప్రకటన చేశారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో చేతులు ఎత్తేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయమని తేల్చేశారు. ఇప్పటివరకు రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్న బడాయి మాటల వెనకున్న అసలు అర్థాన్ని విప్పి చెప్పిన ఆయన.. తాము ధాన్యాన్ని కొన్న తర్వాత కేంద్రం తమ వద్ద కొంటుందని.. తాజాగా కేంద్రం ధాన్యాన్ని కొనమని చెప్పిందని.. అందుకే తాము రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనలేమని స్పష్టం చేశారు.

ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం కరాఖండిగా తేల్చేసిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ఈ విషయంపై చర్చించి.. యాసంగి ధాన్యం కొనేది లేదన్న విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేశారు. రైతులు వరి పండిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిన ఆయన.. ప్రగతిభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరును.. కేంద్ర మంత్రులపైనా విరుచుకుపడ్డారు. మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ హయాంలోదేశం అధోగతి పాలైందన్న ఆయన.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యల్లో ముఖ్యమైన అంశాల్ని చూస్తే..
- ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులు ఎత్తేసింది. యాసంగి ధాన్యం కొనేది లేదని ముందే చెప్పింది. ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయదు. కొనుగోలు కేంద్రాలు పని చేయకూడదని రాష్ట్ర మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
రైతులు వరి పండిస్తే ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.

- యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దు. పండిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు తమ తిండి గింజల కోసం వరి సాగు చేయవచ్చు. విత్తన కంపెనీలు, ప్రైవేటు వ్యాపారులు కొంటారని భరోసా ఉన్నవాళ్లు సాగు చేయవచ్చు. అది రైతుల రిస్క్‌. ప్రభుత్వ పాత్ర లేకుండానే అమ్ముకోవాలి.

- బీజేపీ పాలనలో రూ.80 లక్షల కోట్ల అప్పులు చేశారు. దేశంలో ప్రస్తుతం 1.30 లక్షల కోట్ల అప్పు ఉంది. మీపాలనలో ఏం ఉద్ధరించారు? ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంది? దేశానికి ఒరగబెట్టింది ఏంది? గత రెండేళ్లలో దేశంలో పేదరికం పెంచారు.

- మేం బాజాప్తా బీజేపీతో పోరాటానికి దిగినం. ఢిల్లీలో, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తాం. అన్ని అంశాల మీద కొట్లాడతం. పవర్‌ బిల్లుకు వ్యతిరేకంగా కొట్లాడతాం. ఎస్సీ రిజర్వేషన్‌, గిరిజన రిజర్వేషన్‌ పెంచమని కోరినం. వాళ్లు కింద పెట్టుకొని కూసున్నరు.

- దేశంలో రైతులు బాగుపడాలంటే దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలాలి. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. డీజిల్‌ ధరలు మీరే పెంచుతారు. మళ్లీ రోడ్ల మీదే మీరే గొడవ చేస్తారు. వడ్లు కొనమంటారు. కల్లాల వద్దకెళ్లి గొడవ పెడతారు. ఈ దేశాన్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు?

- ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా చిల్లరకొట్టు షావుకారులా, కిరాణా కొట్టులా కేంద్రం మాట్లాడుతోంది. ఇంత నీచమైన.. దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. భవిష్యత్తులోనూ చూడబోము. దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం, వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్రం బాధ్యత.

- ఆహార రంగంలో దేశాన్ని స్వావలంబనగా ఉంచడానికి బఫర్‌ స్టాక్‌ను ఉంచుకోవాలి. ఎఫ్‌సీఐ కోసం ధాన్యాన్ని సేకరించాలని కేంద్రం అనుకుంటే రాష్ట్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సేకరించి అప్పగిస్తాయి. కొన్నేళ్లుగా ఉన్న విధానమిది. కానీ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. తన సామాజిక బాధ్యతను విస్మరించి, ధాన్యాన్ని కొనలేమని చెబుతోంది.

- ప్రతి విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడతావా? అలాంటప్పుడు నువ్వు ప్రభుత్వం ఎలా అవుతావు? ? ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలి. నిల్వలు పెరిగితే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించే శక్తి కూడా కేంద్రానికే ఉండాలి. ఆ ప్రక్రియలో వేల కోట్లో, లక్ష కోట్లో నష్టం వస్తే కేంద్రమే భరించాలి. కానీ, ఆ సామాజిక బాధ్యత నుంచి తప్పుకొంటూ నెపాలను ఘోరాతిఘోరంగా రాష్ట్రాలపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది.

- గత యాసంగిలో రాష్ట్రం ఇచ్చిన ధాన్యాన్నే కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. మేం రైతుల నుంచి సేకరించిన ధాన్యం తీసుకోవాలని.. వాటికి డబ్బులు ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి సమాధానం లేదు. గత యాసంగి ఉప్పుడు బియ్యం తీసుకోవాలి. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వమంటూ అండర్‌ టేకింగ్‌ ఇస్తేనే ఇప్పుడు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తుంది.

- మెడ మీద కత్తి పెట్టి మరీ అండర్‌ టేకింగ్‌ రాయించుకున్నారు. లేకపోతే, 25 లక్షల టన్నుల బియ్యం మీద పడతాయి. బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోతే, ముడి బియ్యం ఏడాదికి ఎంత తీసుకుంటారో చెప్పాలని అడిగితే.. ఆ విషయం కూడా చెప్పడం లేదు. వానాకాలం పంట టార్గెట్‌కే దిక్కు లేదు. యాసంగిలోపంట ఎక్కువ పండినా.. 35డిగ్రీలఎండ ఉంటుంది. నూక శాతం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలం పండే వడ్లకు క్వింటాకు 67 కేజీల బియ్యం వస్తే..యాసంగి వడ్లకు 35కేజీలే వస్తాయి. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి?

- కేంద్రంలో రైతు హంతక ప్రభుత్వం ఉంది. దిక్కుమాలిన చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకుంది. అది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది. రైతు రాబంధు పార్టీ మీది. మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము రైతు బంధువులం. పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచింది ఎవరు? మోదీ ప్రభుత్వం కాదా? క్రూడాయిల్‌ ధర అప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత?

- క్రూడాయిల్‌ ధర తగ్గిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పి డీజిల్‌ ధర పెంచలేదా? తర్వాత రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలంటూ ధర్నాలు చేస్తారు. సిగ్గుందా? వీళ్లు ముంచెటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు కాదు. అదానీ, అంబానీలకు అప్పజెప్పేందుకే సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. రైతులు గట్టిగా ఉద్యమించగానే ఉపసంహరించుకుంది.

- బీజేపీ నేతలు దేశంలో మత పిచ్చి లేపి విభజన రాజకీయాలు చేస్తారు. దేశాన్ని రావణ కాష్టం చేస్తారు. మతాల మధ్య పంచాయతీ పెట్టి.. కల్లోలాలు సృష్టించి.. కర్ప్యూలు, లాఠీచార్జీలు పెట్టాలని చూస్తున్నారు. మేధావులారా.. బీజేపీని మీరు అంగీకరిస్తారా? వాళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతాం. దుర్మార్గులు.. రాబంధుల్లాగా పడి రైతులను నాశనం చేస్తున్నారు.

- బీజేపీ ప్రభుత్వం చంపిన 750 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం ఇచ్చేందుకు కేబినెట్‌ రూ.22.50 కోట్లు మంజూరు చేసింది. నేను.. మంత్రులూ వెళ్లి వాటిని ఇస్తాం.