Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌...మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది

By:  Tupaki Desk   |   2 Feb 2022 5:40 AM GMT
కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌...మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు దేశ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారా? గ‌తంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కొద్దిరోజుల పాటు హ‌డావుడి చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి మ‌ళ్లీ అదే ప‌దం అనుకుంటున్నారా? ఇందుకోసం అంత‌ర్గ‌తంగా ఎజెండా కూడా రూపొందించుకున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. అందులోనూ స్వ‌యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే ఈ చ‌ర్చ తెర‌మీద‌కు రావ‌డం అస‌లు ట్విస్ట్‌!

కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్ అనంత‌రం మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, అనంత‌రం బీజేపీ పొరపాట్లు చేశాయని విశ్లేషించారు. బీజేపీవ‌న్నీ త‌ప్పుడు లెక్క‌లు.. పచ్చి అబ‌ద్ధాల‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏమిటో, బీజేపీ ఏమిటో దేశ ప్రజలు చూశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారత్‌ తెలివైన దేశం.. మౌనంగా ఉండదు.. స్పందించాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్‌ శక్తి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది అర్థం అవుతుందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు.. హక్కులపై కేంద్ర, రాష్ట్ర జాబితాలు, ఉమ్మడి జాబితాలు ఉన్నాయని, కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవన్నారు. సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా లేవని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం 8 ఏళ్ల‌లో ఏం చేసిందని సీఎం కేసీఆర్‌ ప్ర‌శ్నించారు. రేకు డ‌బ్బాలో రాళ్లు వేసి లొడ‌లొడా ఊప‌డం త‌ప్పితే ఎవ‌రికి మేలు జ‌రిగింది? జీడీపీ త‌గ్గిపోయింది. ఆక‌లి రాజ్యం పెరుగుతోంది. కూర్చుందామా చ‌ర్చ‌కు. నేను రెడీ. ఏం మార్పు తెచ్చారు. దిక్కుమాలిన మ‌త పిచ్చి లేప‌డం.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల‌కు కొట్లాట‌లు పెట్ట‌డం. సిగ్గు లేకుండా అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు చేయ‌డం త‌ప్ప అని ప్ర‌శ్నించారు.

త్వ‌ర‌లోనే దేశ భ‌విష్య‌త్తు కోసం ఉద్య‌మిస్తాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉన్న వ‌న‌రులు, వ‌స‌తులు కూడా వాడుకోలేని ప‌రిస్థితి నుంచి ఈ దేశం బ‌య‌ట‌ప‌డాలి.. అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ``ఈ దేశంలో ఏం జ‌ర‌గాలి.. ఏ ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్లాలి అనేది మేథోమ‌థ‌నంలో తేలుతుంది. కొద్ది రోజుల్లో హైద‌రాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ అధికారుల స‌ద‌స్సును నిర్వ‌హించ‌బోతున్నాం. దీన్ని ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి కోస‌మో.. చిల్ల‌ర రాజ‌కీయాల కోస‌మే నేను ఆలోచించ‌డం లేదు. దేశ భ‌విష్య‌త్తు కోసం.. ఆలోచిస్తున్నా`` అంటూ త‌న ముంద‌డుగు, అందుకు త‌గ్గ గేమ్ ప్లాన్ గురించి క్లారిటీ ఇచ్చేశారు.