Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు వైఫల్యాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   30 Nov 2021 6:31 AM GMT
మోడీ సర్కారు వైఫల్యాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. తాను ఎంతలా ట్రై చేస్తున్నా.. రాష్ట్ర రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న ధోరణిపై ఆయన మంచి కాక మీద ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ.. తాను తీసేయాలని డిసైడ్ అయిన తర్వాత వెనక్కి తగ్గిన ధర్నా చౌక్ వద్ద.. తన పార్టీ నేతలతో కలిసి కూర్చొని ధర్నా చేసిన ఆయన.. తాజాగా కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు.

కేంద్రంలోని మోడీ సర్కారును పలు సందర్భాల్లో పొగిడేసిన ఆయన.. తాజాగా తిట్ల ప్రోగ్రాంను షురూ చేశారు. మోడీ సర్కారు ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని ఆయన చెప్పే క్రమంలో బలమైన సాక్ష్యాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. గడిచిన కొంతకాలంగా మోడీ సర్కారు వైఫల్యం మీద చిందులు తొక్కుతున్న ఆయన.. తన ఆగ్రహావేశాల్ని మాత్రమే ప్రదర్శించారు తప్పించి.. అందుకు తగ్గ ఆధారాల్ని మాత్రం చూపించలేదు.

తాజాగా ఆ కొరత తీర్చే ప్రయత్నం చేశారు. వరల్డ్ హంగర్ ఇండెక్సులో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ర్యాంకింగ్ దిగజారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లో సర్వే చేస్తే.. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం సిగ్గుపోయేలా ఉందన్నారు. తమ పొరుగు దేశమైన పాకిస్థాన్ 92వ స్థానంలో ఉంటే భారత్ మాత్రం 101 స్థానంలో ఉందన్నారు.

ఇరుగుపొరుగున ఉన్న బంగ్లాదేశ్.. నేపాల్ ర్యాంకు 76గా ఆయన చెప్పారు. దేశం ఉన్న దారుణ పరిస్థితిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బీజేపీ హయాంలో ఆకలి కేకలు పెరిగాయని.. అయినా బియ్యం కొనేది లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ‘ఇదీ మన బతుకు’ అంటూ ర్యాంకింగ్ లో వెనుకబడిన ఉన్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాల్ని తీసుకురావటం ద్వారా 750 మంది రైతుల పొట్ట కొట్టారన్న ఆయన.. మోడీ సర్కారు చేతకాని దద్దమ్మ సర్కారుగా ధ్వజమెత్తారు. బీజేపీ రైతు రాబంధు పార్టీ అని.. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మరి.. కేసీఆర్ చూపించిన సాక్ష్యం మీద కమలనాథులు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.