Begin typing your search above and press return to search.

కేసీఆర్‌, జ‌గ‌న్ మీటింగ్‌...న‌దుల అనుసంధానం అడ్ర‌స్సేది?

By:  Tupaki Desk   |   4 Jan 2020 11:05 AM GMT
కేసీఆర్‌, జ‌గ‌న్ మీటింగ్‌...న‌దుల అనుసంధానం అడ్ర‌స్సేది?
X
గోదావరి జలాలలను కృష్ణలో కలపాలన్నది ఒక బృహత్తరమైన ఆలోచన. సుదీర్ఘ‌కాల క‌ల‌. గ‌త‌ ఏడాది తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ విచ్చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంలో కీల‌క చ‌ర్చ‌లే జ‌రిపారు. విభజన సమస్యలు, గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం, శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు తదితర అంశాల పై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం, వాటి ప‌రిష్కారం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ప్ర‌ధానంగా గోదావరి - కృష్ణా నదుల అనుసంధానంపై అంద‌రి ఆస‌క్తి ప‌డింది. అయితే, ఇప్పుడు ఆ ప్రాజెక్టు అట‌కెక్కింది. గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుని కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల దాహార్తి తీర్చ‌డంపై దృష్టి సారించారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే, తెలంగాణ తో సంబంధం లేకుండా ఏపీలో నదుల అనుసంధాన ప్రక్రియ పై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం ఇందు లో భాగ‌మేన‌ని అంటున్నారు.


రాజ‌కీయ‌, ఆర్థిక సంబంధ‌మైన కార‌ణాలు జ‌గ‌న్ త‌న సొంత ఎజెండా తో ముందుకు పోయేందుకు కార‌ణ‌మంటున్నారు. ఎన్నికల్లో చేసిన సాయానికి రుణం తీర్చుకునేందుకే జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ కేసీఆర్‌తో నదుల అనుసంధానం పై చర్చిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ పదే పదే విమర్శలు చేస్తోంది. మ‌రోవైపు, ఉమ్మడిగా ప్రాజెక్టును చేపడితే దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతాయని లెక్క తేలింది. ఇందుకోసం కేంద్రం నుంచి ఆర్థిక సాయం తీసుకోవడంతో పాటు పలు ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో స‌హ‌జంగానే ఖ‌జానా వైపు జ‌గ‌న్ చూపు ప‌డింది.

ఇదే స‌మ‌యంలో, ఉమ్మడిగా ప్రాజెక్టు ను చేపడితే మరో సంక్లిష్టత తలెత్తే అవకాశం ఉంది. ఏపీ లో నదుల అనుసంధానం ఎక్కడ చేపట్టాలనే దానిపై తెలంగాణ ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుందని.. అది ప్రభుత్వానికి ఇబ్బందికరం అని అధికారులు చెబుుతున్నట్టు తెలుస్తోంది. అలా కాకుండా సొంతంగా ప్రాజెక్టు ను చేపడితే.. అధికారులు సూచించిన మేరకు ఎక్కడైనా అనుసంధాన ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అలా అయితే భవిష్యత్‌ లోనూ తెలంగాణ తో ఎలాంటి పేచీ ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యం లోనే జగన్ కూడా దాదాపుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ముందు అనుకున్నట్టు కేసీఆర్‌ తో కాకుండా సొంతంగానే ప్రాజెక్టు చేపట్టే విషయం పై ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుని కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క‌దులుతుండ‌టం దీనికి తార్కాణ‌మ‌ని చెప్తున్నారు.