Begin typing your search above and press return to search.

వేటు వేస్తారన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి రాజీనామా?

By:  Tupaki Desk   |   13 July 2021 5:12 AM GMT
వేటు వేస్తారన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి రాజీనామా?
X
దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఈ రోజున దేశంలో రాజకీయం ఇలా తగలబడటానికి కారణంగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు.. అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవటానికి వారు చేసిన ప్రయత్నాలు.. ఎన్నో దుష్ట సంప్రదాయాలకు కారణమైందన్నది నిజం. అందుకే.. కొందరు కాంగ్రెస్ ను విపరీతంగా ద్వేషిస్తారు. అయితే.. మోడీ పుణ్యమా అని.. దేశంలో కాంగ్రెస్ అవసరాన్ని.. ఆ పార్టీ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన మొదలైంది. ఇదిలా ఉంటే..చాలా రాజకీయ పార్టీల్లో లేని విధానాలు కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువన్న పేరుతో.. పార్టీని డ్యామేజ్ చేసేలా కాంగ్రెస్ నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక్కడ పార్టీని బద్నాం చేయటం కంటే కూడా.. పార్టీలోని తమ రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ తీయటం కోసం పార్టీ ప్రయోజనాల్ని బలిచ్చేందుకు సైతం వెనుకాడరు. ఈ తీరు.. కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనంగా చేయటంతో పాటు.. అసమ్మతి పార్టీకి ఎంతకూ తరగని వైనం కనిపిస్తుంది. తమ ప్రయోజనాలకు భంగం కలిగించిన వారు రచ్చ రచ్చ చేస్తున్నా.. వారిపై చర్యల కత్తి ఝుళిపించేందుకు ఇష్టపడరు. చాలా అరుదైన సందర్భాల్లోనే వెనువెంటనే చర్యలు తీసుకుంటారు.

ఇలా కాంగ్రెస్ అన్నంతనే గుర్తుకు వచ్చే ఎన్నో అవలక్షణాల్ని సరి చేసే పనిలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త నాయకత్వం కరకు విధానాన్ని అనుసరించాలని భావిస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇందుకు కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో హుజారాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్.. ఓటమిపాలైనప్పటికీ తన ఓటు బ్యాంక్ ను బలంగా పెంచుకోగలిగారు. తాజాగా ఈటల పార్టీ నుంచి బయటకు వచ్చేసి.. బీజేపీలో చేరటం.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదే సమయంలో కౌశిక్ రెడ్డితో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావటం.. పలు ఊహాగానాలకు తెర తీసింది. ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంలో కౌశిక్ రెడ్డితో కేటీఆర్ చర్చలు జరిపిన వైనంపై కౌశిక్ వివరణ ఇస్తూ.. రోటీన్ మాటలే సాగినట్లుగా చెప్పారు. తాజాగా కౌశిక్ రెడ్డి మాట్లాడినట్లుగా చెప్పిన ఆడియో టేప్ విడుదల కావటం.. అందులో ఎంత డబ్బులు ఖర్చు అయినా ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో పాటు.. టీఆర్ఎస్ టికెట్ తనదేనని చెప్పిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

సాధారణంగా ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు.. చర్చలు.. బుజ్జగింపులతో పాటు.. చర్యలేం తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటుంది. అందుకు భిన్నంగా తాజాగా పరిణామాలు ఉండటం గమనార్హం. ఫోన్ కాల్ ఆడియో క్లిప్ బయటకురావటం.. వైరల్ అయిన వెంటనే ఆయనకు షోకాజ్ నోటీసు పంపటమే కాదు.. ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపేలా నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని గుర్తించిన కౌశిక్ రెడ్డి తాజాగా మీడియా భేటీని ఏర్పాటు చేసి.. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను మీడియాకు ఇచ్చారు. అంతేకాదు.. టీపీసీసీ చీఫ్ పదవి కోసం మాణిక్యం ఠాగూర్ కు రేవంత్ రూ.50 కోట్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. ఇదంతా ఎందుకంటే.. షోకాజ్ నోటీసు పంపి అందుకు సమాధానాన్ని 24 గంటల్లో ఇవ్వాలని గడువు విధించారు. తాను వివరణ పంపినా.. వేటు వేయటం ఖాయమన్న విషయంపై కౌశిక్ క్లారిటీతో ఉన్నారని.. ఆ కారణంతోనే ముందుగా తానే ఒక అడుగు ముందుకేసి పార్టీకి రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీలో తప్పులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారన్న సందేశాన్ని కౌశిక ఎపిసోడ్ తో స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.