Begin typing your search above and press return to search.

ఈటల ఇలాకాలో 100 కోట్ల సవాల్.. బస్తీమే సవాల్ అంటూ తొడగొట్టారే?

By:  Tupaki Desk   |   4 Aug 2022 2:02 PM GMT
ఈటల ఇలాకాలో 100 కోట్ల సవాల్.. బస్తీమే సవాల్ అంటూ తొడగొట్టారే?
X
‘హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు 100 కోట్ల రూపాయలు తీసుకురా.. నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 120 కోట్ల రూపాయలు తీసుకొస్తా..’ అంటూ స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. గత కొన్ని రోజులుగా ఈటల, కౌశిక్ రెడ్డిల మధ్య ఆరోపణలు వాడి వేడిగా సాగుతున్నాయి. తాజాగా ఈ ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజూరాబాద్ టౌన్లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ‘అంబేద్కర్ నగర్ లో చర్చకు రా..’ అంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి కేంద్రం నుంచి ఒక్క రూపాయయైనా తీసుకొచ్చావా..? అని ప్రశ్నించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. 10 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికతో తెలంగాణ ప్రజానీకాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఉత్కంఠగా సాగిన ఇక్కడి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఈటల రాజేందర్ గెలుపొందారు. అయితే ఆ తరువాత కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గం గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. కానీ గత కొన్నిరోజులుగా ఈటల రాజేందర్ కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అవసరమైతే గజ్వేల్ లో పోటీ చేస్తానని అన్నారు. హుజూరాబాద్ లో లేదా గజ్వేల్ లో ఎక్కడైనా పోటీ చేస్తానని, కేసీఆర్ పై గెలుస్తానని అన్నారు.

ఈ నేపథ్యంలో ఇదే నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏకంగా హుజూరాబాద్ టౌన్లో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధిపై ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 10 నెలల్లో హుజూరాబాద్ కు ఏం చేశారో తెలియజేయాలన్నారు. ఈటల రాజేందర్ సొంత ఊరు కమలాపూర్లోనే బస్టాండ్ లేదని, అలాంటయన నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ది చేస్తాడని ఎద్దేవా చేశారు.

సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయలేని ఈటల రాజందర్ కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లోపోటీ చేసే దమ్ముందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటికైనా హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నువ్వు కేంద్రం నుంచి 100 కోట్లు తీసుకురావాలని.. నేను 120 కోట్ల రూపాయలు తీసుకొస్తానని అన్నారు. అలా తెచ్చె సత్తా ఉందా..? అని సవాల్ విసిరారు. ఈటల రాజేంద్ హైదరాబాద్ లో యాక్టర్ గా.. ఢిల్లీలో బ్రోకర్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంతో గౌరవప్రదంగా ఉన్న ఆయన బీజేపీలో చేరి అభాసుపాలవుతున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లో రాజకీయం మరోసారి వేడెక్కనుంది. అయితే ఈటల రాజేందర్ కు బీజేపీలో చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ నుంచి ఎమ్మల్యేలు, మంత్రులు టచ్ లో ఉన్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేసి గెలుస్తానని అన్నారు. ఈ సవాల్ పై కౌశిక్ రెడ్డి రియాక్టయ్యాడు. అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ లో జోష్ పెరిగింది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ లో స్తబ్ధంగా ఉన్న కౌశిక్ ఒక్కసారిగా ఫైర్ కావడంతో మరోసారి ఆ పార్టీకి ఊపు తేనుందా..? అనే చర్చ మొదలైంది.