Begin typing your search above and press return to search.

ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారన్న వార్త వస్తే..?

By:  Tupaki Desk   |   12 Aug 2016 1:25 PM GMT
ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారన్న వార్త వస్తే..?
X
మీడియాలో వచ్చే కొన్ని వార్తలకు.. వాస్తవానికి మధ్య అంతరం ఎంతలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మీడియాలో వచ్చే వార్తల వెనుక ఏదైనా వ్యూహం ఉంటుందా? మీడియా ఎలాంటి తప్పులు చేస్తుంది? అలా చేసే తప్పుల ఫలితాలు ఎంతలా ఉంటాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే పరిస్థితి. మీడియాలో ప్రముఖుడైన శేఖర్ గుప్తా ఇటీవల ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని చదవితే తరచూ మదిని తొలిచేసే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం కలుగుతుంది. ఆ పుస్తకంలోని కొన్ని అంశాల్ని చూసినప్పుడు నిజంగా అలా జరిగిందా అనిపించక మానదు. అలాంటి ఘటనల విషయానికి వస్తే..

ముంబయి మారణహోమం లో ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ ఒక్కడే. అతడ్ని న్యాయబద్ధంగా విచారించి.. కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయటం తెలిసిందే. కసబ్ ను అదుపులోకి తీసుకొన్న దగ్గర నుంచి.. ఉరి తీసే మధ్య కాలంలో కొన్ని వార్తలు మీడియాలో వచ్చేవి. బిర్యానీ కోసం కసబ్ గొడవ చేశాడంటూ వార్తలు వచ్చేవి. కానీ.. ఇవన్ని ఉత్తుత్తి వార్తలు మాత్రమే. ఎందుకంటే కసబ్ మీద దేశ ప్రజల్లోనూ.. న్యాయమూర్తుల్లోనూ ఆగ్రహం కలిగించేందుకే అలాంటి మాటలు తాము చెప్పినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించటం గమనార్హం. అయితే.. కసబ్ ఉరితీత అనంతరమే ఆయన నోటి నుంచి నిజం బయటకు రావటం గమనార్హం. బిర్యానీ థియరీ మొత్తం కోపం పెంచేందుకేనట.

ఇలాంటివే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బిర్యానీ థియరీ ఒకటి దేశ వ్యాప్తంగా కలకలం రేపటమే కాదు.. భారీ చర్చనే రేపింది. కశ్మీరీ ఉగ్రవాదులతో చర్చల సందర్భంగా (1993లో) వారికి భోజనం పెట్టాల్సి వచ్చినప్పుడు వారికి బిర్యానీ వడ్డించారంటూ వార్తలు రావటం.. దీనిపై పీవీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శ్రీనగర్ లోని ప్రఖ్యాత హజ్రత్ బాల్ దర్గా వేదికకగా ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన ఉగ్రవాదుల్ని చంపిపారేస్తే అయిపోయే దానికి చర్చలేంటంటూ చాలామంది ఆగ్రహం ప్రదర్శించారు.

ఇలా చర్చల మధ్యలో భోజన విరామం రావటంతో వారికి భోజనం వడ్డించారు. అయితే.. అందులో బిర్యానీ వడ్డించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. అదంతా రాజకీయం కోసం సృష్టించినవే తప్పించి నిజంగా అలా జరగలేదట.వాస్తవానికి ఉగ్రవాదులకు వడ్డించే భోజనం కోసం దగ్గర్లోని సీఆర్ఫీఎఫ్ క్యాంప్ నుంచి సాధారణ భోజనం తెప్పించారట. వాస్తవానికి కశ్మీరీ ఉగ్రవాదులు బిర్యానీ తినటానికి ఇష్టపడరట.

ప్రభుత్వాల మీద కానీ.. ఉగ్రవాదుల మీద కానీ ఆగ్రహం పెంచేందుకే ఈ తరహా వార్తల్ని సృష్టించటం జరుగుతుందట. ఇక.. టీవీ ఛానళ్ల మధ్య ఉన్న పోటీ పుణ్యమా అని ఎంత దారుణాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని చెప్పుకొస్తూ.. కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఆ మధ్యన హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన అక్కాచెల్లెళ్లు తమను వేధించాడంటూ ఒక యువకుడ్ని చావబాదటం.. అది దేశ వ్యాప్తంగా సంచలనం మారింది. అయితే.. అదంతా కావాలని చేసిన పని అని.. దెబ్బలు తిన్న వ్యక్తి ఆ మహిళలకు సంబంధించిన వాడేనన్న నిజం బయటకు వచ్చిన తర్వాత అంతా నోరు మూసుకునే పరిస్థితి.

నాగాలాండ్ లో ఒక మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై స్థానిక జైలు గోడల్ని బద్ధలు కొట్టి మరీ లోపలున్న యువకుడ్ని బయటకు తీసుకొచ్చి కొట్టి చంపారు. ఆ ఉదంతంలోనూ టీవీల్లో చర్చల పుణ్యం కారణంగా పెద్ద తప్పే చోటు చేసుకుంది. ఈ యువకుడికి రేప్ కి సంబంధం లేదని.. నిజానికి అతడో అమర సైనికుడి సోదరుడిగా తేలింది. ఇలా చాలా సందర్భాల్లో వెనుకా ముందు చూసుకోకుండా.. హడావుడిగా టీవీల్లో చర్చలు మొదలు పెట్టటం.. ఆ సందర్భంగా వక్తలుగా ఉన్న వారంతా ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోవటం.. ఆ తర్వాత బుక్ కావటం ఈ మధ్యన ఎక్కువైందని చెప్పొచ్చు.