Begin typing your search above and press return to search.

క‌రుణానిధి అంత్య‌క్రియలు..'మెరీనా' జన‌సంద్రం!

By:  Tupaki Desk   |   8 Aug 2018 3:38 PM GMT
క‌రుణానిధి అంత్య‌క్రియలు..మెరీనా జన‌సంద్రం!
X
క‌లైజ్ఞ‌ర్ క‌రుణానిధి అంతిమ యాత్ర సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్‌ నుంచి ప్రారంభ‌మైంది. వాలాజా రోడ్‌ - చెపాక్‌ స్టేడియం మీదుగా రెండు గంట‌ల‌పాటు సాగిన అంతిమయాత్ర కొద్ది సేప‌టి క్రితం మెరీనా బీచ్ కు చేరుకుంది. ప్ర‌స్తుతం మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్‌ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రుణానిధి చెప్పినట్లు``విరామమన్నది ఎరుగక - నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు``అన్న మాట‌ల‌ను ‘కలైజ్ఞర్‌’ శవపేటిక మీద స్టాలిన్ చెక్కించారు. క‌రుణానిధికి ఆయ‌న కుటుంబ స‌భ్యులు పాదాభివంద‌నం చేసి క‌డ‌సారిగా నివాళుల‌ర్పిస్తున్నారు. కరుణానిధికి తుది వీడ్కోలు ప‌లికేందుకు మాజీ ప్రధాని దేవేగౌడ - కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ - కేంద్ర మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌ - ఏపీ సీఎం చంద్రబాబు - తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఓబ్రీన్‌ - తమిళనాడు మంత్రి డి జయకుమార్‌ - గులాంనబీ అజాద్‌ - శరద్‌ పవార్‌ అన్నా స్క్వేర్ కు చేరుకున్నారు. మెరీనా బీచ్‌ పరిసరాలు శోకసంద్రంగా మారాయి.త‌మ ప్రియ‌త‌మ నేత‌ను చూసేందుకు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన క‌రుణ అభిమానులు - డీఎంకే కార్య‌క‌ర్త‌ల‌తో మెరీనా బీచ్ జ‌న‌సంద్ర‌మైంది.

అంత‌కుముందు, కరుణానిధి భౌతికకాయం ఉంచిన రాజాజీ హాలు వద్ద తొక్కిసలాట జ‌రిగి ఇద్ద‌రు మృతి చెందారు. ఒక్క‌సారిగా ప్ర‌జ‌లు - అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్‌ లో ఒక్కసారిగా తొక్కిసలాట జ‌రిగింది. వారిని అదుపుచేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందగా.... సుమారు 40 మంది గాయపడ్డారు. దీంతో, 'కలైజ్ఞర్' అభిమానులంతా సంయమనం పాటించాలని స్టాలిన్ మైక్ లో విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నవాళ్లు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటార‌ని, క్యాడర్ సంయమనంతో వ్యవహరించి బ‌లం చాటాల‌ని కోరారు. మ‌హానేత అంతిమ యాత్ర‌కు ఎలాంటి ఇబ్బందులు కలలగకుండా సహకరించాల‌ని కోరారు. కలైజ్ఞర్‌ కు ఘన నివాళులర్పించడం ద్వారా ఆయనను సజావుగా సాగనంపాలని కోరారు. ప్రజలంతా సంయమనం పాటించి 'కలైజ్ఞర్'ని కడసారి దర్శించుకునేందుకు వీలుగా పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.