Begin typing your search above and press return to search.

పిన్ని తెచ్చిన వివాదంతో అమ్మ కు చిక్కులు

By:  Tupaki Desk   |   1 Nov 2015 10:06 AM GMT
పిన్ని తెచ్చిన వివాదంతో  అమ్మ కు చిక్కులు
X
తమిళనాడు సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా అది జయకు కూడా ఇబ్బందిగా మారుతోంది. ఇంతకీ ఏంటా వివాదం? శశికళకేంటి సంబంధం?.

శశికళకు ఆమె వదిన ఇళవరసి ఇటీవలే రూ.వెయ్యి కోట్లతో లక్స్‌ మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌ని కొనుగోలు చేశారు. చెన్నై శివారు వేలాచ్చేరిలో 11 సినిమా స్క్రీన్స్‌ తో, ఆసియాలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో అట్టహాసంగా ఈ మల్టీప్లెక్స్‌ ని నిర్మించింది ఎస్‌ పీఐ సినిమాస్‌. ఆ సంస్థ నుంచి ఇళవరసి కాంప్లెక్స్‌ ని కొనుగోలు చేసినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌ సైట్‌ లో పెట్టడంతో తమిళనాట రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. శశికళ వదినకు వెయ్యి కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇదంతా సిఎం బినామీ వ్యవహారమేనని ఆరోపిస్తున్నారు.

1991-92 - 1992-93 సంవత్సరాలకు సంబంధించి ఆదాయపు పన్ను ఎగవేత కేసులో జయలలిత, శశికళ రెండు కోట్ల రూపాయలు చెల్లించి నిరుడే బయటపడ్డారు. అలాంటిది శశికళకు, ఆమె వదినకు ఇంతలోనే వెయ్యి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తోంది డీఎంకే. మరో నాలుగు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ వివాదం అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తనకెవరూ లేరని, రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తున్నానని తరచూ మాట్లాడే జయలలిత దీనికేం సమాధానం చెబుతారని అడుగుతున్నారు తమిళ ప్రతిపక్ష నేతలు.