Begin typing your search above and press return to search.

కర్ణాటకలో.. లేటెస్ట్ నంబర్లు ఇలా!

By:  Tupaki Desk   |   12 July 2019 3:58 PM GMT
కర్ణాటకలో.. లేటెస్ట్ నంబర్లు ఇలా!
X
పక్క రాష్ట్రం కర్ణాటక రాజకీయాలు కీలక తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ముఖ్యమంత్రి హెచ్‌ డీ కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ను కోరారు. ఆర్థిక బిల్లును ఆమోదించేందుకు శుక్రవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం పలు పరిణామాలకు దారి తీసింది. ఈ క్రమంలో కర్ణాటకలో మళ్లీ రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మూడు పార్టీల ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తీసుకెళ్లారు. అయితే రాజీనామా చేసిన వారెవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు.

వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్‌ – జేడీఎస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం నెలకొంది. ఈసందర్భంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బలం నిరూపించుకునేందుకు తాము సిద్ధమని స్పీకర్‌ ను కోరారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టుకు తరలించారు. ఈమేరకు నగర శివారులోని రమడా రిసార్టుకు బీజేపీ సభ్యులను తరలించారు. తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో భద్రపరిచినట్లు మాజీ సీఎం యడ్డూరప్ప తెలిపారు. రిసార్టు నుంచి నేరుగా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. సభ ముగియగానే వారందరినీ అదే రిసార్టుకు తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ రిసార్టు బదులు యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌ కు తీసుకెళ్లారు. అయితే ముంబయిలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని విప్‌ జారీ చేసినప్పటికీ డుమ్మా కొట్టారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆనందసింగ్‌ శుక్రవారం గోవా తరలివెళ్లారు.

బలాబలాలు
బీజేపీ – 105
స్వతంత్య్రులు – 02
కాంగ్రెస్‌ – 66
జేడీఎస్‌ – 34
బీఎస్పీ – 01
రాజీనామా – 16 మంది

మొత్తం – 224