Begin typing your search above and press return to search.

కాన్పూరు ఐఐటీ పరిశోధకుల మాటను చెప్పి వార్నింగ్ ఇచ్చిన కర్ణాటక మంత్రి

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 PM GMT
కాన్పూరు ఐఐటీ పరిశోధకుల మాటను చెప్పి వార్నింగ్ ఇచ్చిన కర్ణాటక మంత్రి
X
కరోనా విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని గడిచిన రెండేళ్లుగా యావత్ ప్రపంచం నేర్చుకుంటూనే ఉంది. దీని విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామో.. అలా చేసిన ప్రతి దేశానికి చేదు అనుభవం తప్పలేదు. చిన్నపామును పెద్ద కర్రతో కొట్టాలన్న రూల్ ను కరోనా విషయంలో పక్కాగా పాటించాల్సిందే. మొదటి వేవ్ తో పోలిస్తే రెండో వేవ్ చుక్కలు చూపించటమే కాదు.. మొదటి వేవ్ నే ఎదుర్కొన్నామన్న భరోసాతో అజాగ్రత్తగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి దారుణమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది రెండో వేవ్.

దీని దెబ్బతో మూడో వేవ్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ.. కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. కాకుంటే.. తీవ్రత పెద్దగా లేకపోవటంతో మన దేశంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాలేదు. కాకుంటే.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మూడో వేవ్ నాటికి నూటికి అరవై డెబ్భై శాతాన్ని టచ్ చేసింది కరోనా.

దాని పీడ పోయిన తర్వాత నుంచి ప్రశాంతంగా ఉన్న వేళ.. తాజాగా నాలుగో వేవ్ అంటూ హెచ్చరికలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న మాస్కు ముఖానికి అక్కర్లేదన్న మాటను పలువురు చెప్పటమే కాదు.. ఇప్పుడిప్పుడే ముఖానికి మాస్కు లేకుండా షాపింగ్ మాల్ లోనూ.. మల్టీఫ్లెక్సుల్లోనూ ఉంటున్న పరిస్థితి. మెట్రో.. ఆర్టీసీ.. ట్రైన్ జర్నీలలో మాస్కుల్ని పెద్దగా వినియోగించట్లేదు. అయితే.. ఇలాంటి వాటిని మళ్లీ పాటించాల్సిన టైం వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా కాన్పూరు ఐఐటీ పరిశోధకులు వెల్లడించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర మంత్రి సుధాకర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. జూన్ చివర్లో దేశంలో నాలుగో వేవ్ మొదలవుతుందని.. జులైలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని.. దీని తీవ్రత అక్టోబరు వరకు సాగటం ఖాయమని చెబుతున్నారు.

మిగిలిన పరిశోధకుల మాదిరి కాన్పూరు ఐఐటీ పరిశోధకుల అంచనాను సింఫుల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే.. వారు వేసిన అంచనాలు మొదటి..రెండు..మూడో దశల్లో నిజమైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రపంచం నుంచి కరోనా పూర్తిగా మాయమైపోతుందని చెప్పలేమని.. అందుకే వ్యాక్సిన్ వేయించుకోవటం.. మాస్కు ధరించటం.. భౌతిక దూరాన్ని పాటించటం.. లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.

దేశంలోని కేంద్ర మంత్రులు కానీ.. వివిధ రాష్ట్రాల్లోని మంత్రులు కానీ పట్టించుకోని ఐఐటీ కాన్పూరు పరిశోధకుల నివేదికను కర్ణాటక మంత్రి సుధాకర్ పట్టించుకోవటం.. అందరిని అప్రమత్తంగా అయ్యేలా చేసినందుకు ఆయన్ను అభినందించాల్సిందే. మొదటి మూడు దశల అనుభవాల నేపథ్యంలో నాలుగో వేవ్ కు సంబంధించిన అంచనాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.