Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు శాపం.. కర్ణాటక నిర్ణయం!

By:  Tupaki Desk   |   3 July 2020 5:30 PM GMT
తెలుగు రాష్ట్రాలకు శాపం.. కర్ణాటక నిర్ణయం!
X
కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతలు కడుతూ నీటిని తరలించుకుపోవాలని ఓ వైపు తెలుగు రాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేసుకుంటున్నాయి. నీటి వాటా కోసం బోర్డులకు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. అయితే మన నోటికాడికి నీరు రాకుండా పైనున్న కర్ణాటక కుయుక్తులు పన్నుతోంది. కేంద్రంలో.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలే ఉండడంతో ఈ కుయుక్తులు పన్నుతున్నాయి. ఈ ప్రతిపాదనలు తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారనున్నాయి.

తాజాగా కృష్ణా నదిపై తెలంగాణ సరిహద్దుకు దగ్గరలోని కర్ణాటక ప్రాజెక్టు ఆలమట్టి ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎత్తు పెంపుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఏకంగా ఆలమట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్ఖిహోళి తెలిపారు.త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు.

ఈ పరిణామం తెలుగు రాష్ట్రాలకు తీవ్ర విఘాతం కానుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పులను కాదని కర్ణాటక ఆలమట్టి పెంచడం చట్టవిరుద్ధమని తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఆలమట్టి పెంచితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు రావని.. ఆయకట్టు ఎడారిగా మారుతుందని ఆందోళన నెలకొంది. దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆపాలని రైతులు కోరుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపుచేయించాలని అంటున్నారు.